Saturday, April 27, 2024

బిజెపిని రానివ్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ గడ్డపై బిజెపిని రానివ్వమని ఉభయ కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నేతలు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కే తమ మద్దతు ఉంటుందన్నారు. నాంపల్లిలో సిపిఐ, సిపిఎం నేతల ఉమ్మడి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపిని ఓడించేందుకు వామపక్షాలు అన్నదమ్ముల్లా కలిసి పని చేయాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాపకింద నీరులా కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాసమస్యలు, మోడీ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడనున్నట్టు ప్రకటించాయి. మొట్టమొదటి సారిగా సిపిఐ, సిపిఎం నేతలు సంయుక్తంగా సమావేశం నిర్వహించటం విశేషం. ఇప్పటి వరకు విడివిడిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఈ రెండు పార్టీలు తెలంగాణ వేదికగా ఏకమవుతున్నట్టు సుస్పష్టంగా ప్రకటించాయి. తెలంగాణలో జరిగిన ఈ సంగమం దేశానికే ఒక సంకేతం కావాలని ఇరు పార్టీల నేతలు ఆంకాంక్షించారు. చట్టసభల్లో కమ్యూనిస్టుల బలం పెంచుకునేందుకు కలిసి పోటీ చేయనున్నట్టు సంకేత మిచ్చారు. శాసనసభలో బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

కలిసి పనిచేయడానికి రెండు పార్టీలు ముందుకు రావటం శుభపరిణామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మోడీ సర్కారు బిజెపి ప్రభుత్వంలో లేని రాష్ట్రాల్లో ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మోడీ సర్కారుని గద్దెదించాలన్నారు. ‘కమ్యూనిజం ప్రమాదకరమైన సిద్ధాంతమని ప్రధాని మోడీ ఇటీవల అన్నారు. కార్చిచ్చు వంటిదని.. దహించి వేస్తుందని విమర్శించారు. అవును కమ్యూనిజం ప్రమాదకరమైన సిద్ధాంతమే. మోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు కచ్చితంగా ప్రమాదకరమైందే. దేశంలోని శ్రామికులకు కమ్యూనిజం ప్రియమైన సిద్ధాంతం. మోదీ ఆధారపడుతున్న అదానీ, అంబానీకి మాత్రం కాదు. మేము సవాల్ స్వీకరిస్తున్నాం. మీతో పోరాడుతాం. 2024లో బిజెపిను ఓడించి తీరుతా’మని సిపిఐ జాతీయ కార్యదర్శి -రాజా అన్నారు. శాసనసభలో కమ్యునిస్టుల బలం పెంచుకోవాల్సిన అవసరం ఉందని పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్ర అధికారాలు వేరువేరుగా ఉంటాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తెలిపారు.

ఆ హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సహా తమిళనాడు, కేరళలో గవర్నర్‌ను ఒక సాధనంగా కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దేశం కోసం, కార్మికుల రక్షణ కోసం ఒక్కటై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జ్యూడీషియల్, దర్యాప్తు సంస్థలను మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడారు. దేశంలో మోడీ వ్యతిరేక ఫ్రంట్ అవసరం అని వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తం ఎర్రజెండా వైపు చూస్తున్న క్రమంలో వామపక్షాలు కలిసిపోరాడాలని నిర్ణయించుకున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒకేదేశం ఒకే టాక్స్ అని చెప్పే మోడీ ఒకే కులం అని ఎందుకు చెప్పడం లేదన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థ మళ్ళీ రావాలని కోరుకునే వారు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు, ఆర్‌ఎస్‌ఎస్ మూలపురుషులు రాసిన గ్రంధాల్లో ఈ దేశం వర్ణ, కుల సంక్రమణం జరిగిందని, ఏ కులం వారు ఆ కుల వృత్తి చేసుకోవాలి అని చెప్పడమే బిజెపి సిద్దాంతమని తెలిపారు.

బిసి ప్రధాని అంటున్నారని, కానీ బిసిలకు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దేశంలో అన్ని పార్టీలు కులగణన జరగాలి అని చెబుతున్న బిజెపి ఎందుకు చేయడం లేదన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం. బిజెపిని ఎప్పుడూ వ్యతిరేకిస్తునే ఉంటాం. బిజెపి తెలంగాణలో 50 సీట్లు ఇస్తాం అంటే వెళ్తమా? కాలిగోటితో సమానం మీ సీట్లు. ఈ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం కాదు.. తరిమి తరిమి కొడతాం. గోల్కొండ కోట కింద బొంద పెడతామని ఆయన తీవ్రస్వరంతో హెచ్చరించారు. సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి సహా జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News