కేరళ బక్రీద్ సడలింపులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు కరోనా ఆంక్షలను సడలించడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపార వర్గాల ఒత్తిడికి లొంగి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం షాక్కు గురి చేసిందని వ్యాఖ్యానించింది. అయితే ఆంక్షల సడలింపులపై రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను మాత్రం రద్దు చేయలేదు. ‘ ఒత్తిళ్లకు తలొగ్గడం పౌరుల జీవించే హక్కుకు భంగం కలిగించడం కిందికే వస్తుంది. అలాగే కాంవడ్ యాత్రలో భాగంగా యుపి ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను గమనించాలి. ఈ ఆంక్షల సడలింపుల కారణంగా అవాంఛనీయ ఘటనలు జరిగితే.. పౌరులు మా దృష్టికి తీసుకురావచ్చు. చర్యలు తీసుకుంటాం’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
‘రాజ్యాంగంలోని 21 అధికరణలో పేర్కొన్న జీవించే హక్కుకు కట్టుబడి ఉండాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం’ అని న్యాయమూర్తులు ఆర్ ఎఫ్ నారిమన్, బిఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే కేరళ రాష్ట్రప్రభుత్వం మాత్రం ఆంక్షల సడలింపులపై ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకుంది. జూన్ 15నుంచి ఆంక్షల సడలింపులు కొనసాగుతున్నాయని, ఇందులో కొత్తేమీ లేదని వెల్లడించింది. ఇదిలా ఉండగా బక్రీద్ సందర్భంగా ఈ నెల 18నుంచి 20 వరకు ఉదయం 7 గంటలనుంచి రాత్రి 8 గంటలవరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు కేరళ ప్రభుత్వం అనుమతించింది. మంగళవారం చివరి రోజు కావడంతో సడలింపులపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని వ్యాఖ్యానించింది.