Wednesday, May 8, 2024

కేంద్రం ఆర్డినెన్స్‌పై విచారణకు “సుప్రీం” గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ ఢిల్లీ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈనెల 10న దీనిపై విచారణ చేపట్టనున్నది. ఆర్డినెన్సును సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్‌లు పిఎస్ సరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈనెల 10 న విచారణకు జాబితాలో చేర్చడానికి అంగీకరించింది. ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని, కోర్టు తీర్పును, రాజ్యాంగ మౌలిక వ్యవస్థను అధిగమించే ప్రయత్నమని పిటిషన్‌లో ఆప్ ప్రభుత్వం పేర్కొంది.

ఆర్డినెన్సును రద్దు చేయడమే కాకుండా, దీనిపై మధ్యంతర స్టే విధించాలని సుప్రీం కోర్టును కోరింది. ఢిల్లీ లోని పోలీస్, పబ్లిక్ ఆర్డర్, భూ వ్యవహారాలు మినహా ఢిల్లీ లోని మిగతా అన్ని శాఖలు, విభాగాలు , సేవల నియంత్రణ పైన పూర్తి అధికారం, ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ దానిని మోదీ సర్కారు పక్కన పెట్టింది. ప్రత్యేకంగా మే 19న ఆర్డినెన్సును తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లును ఈనెల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్నది. దీనిపై ఆప్ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News