Thursday, May 2, 2024

రామ్‌దేవ్ బాబాకు సుప్రీం కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వక పోవడంతో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులైన యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు సుప్రీం కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఆయనతోపాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత ఏడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వవద్దని సూచించింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలు జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

అయితే.. ఆ హామీని ఉల్లంఘించడంపై గత నెల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల విషయం లోనూ కొన్ని సూచనలు చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయొద్దని మరోసారి సూచించింది. అయితే ఆ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది.‘మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదు? అని జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ అమనుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News