Sunday, May 5, 2024

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను మంగళవారం పరిశీలించింది. ఆగస్టు 2 నుంచి సోమ, శుక్రవారాలు మినహా మిగతా రోజుల్లో పిటిషన్లపై రోజువారీ విచారణ ఉంటుందని తెలియజేసింది.

ఈ కేసులో దస్త్రాలు, రాతపూర్వక వివరణ సమర్పణకు జులై 27ను తుది గడువుగా నిర్ణయించింది. ఈ క్రమం లోనే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేసిన పిటిషనర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలని కోరుతూ ఐఎఎస్ అధికారి షా ఫైజల్, శెహలా రషీద్‌లు చేసిన అభ్యర్థనకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఆ ప్రాంతంలోమునుపెన్నడూ లేని విధంగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీం కోర్టుకు కేంద్రం సోమవారం అఫిడవిట్ సమర్పించిన విషయం తెలిసిందే. దీన్ని పరిశీలించిన ధర్మాసనం , తాము విచారించనున్న కేసుపై ఈ అఫిడవిట్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీని తర్వాత స్థానికంగా హింసాత్మక సంఘటనలు తగ్గిపోయాయని, అభివృద్ధిలో , సుసంపన్నతలో కశ్మీర్ దూసుకుపోతోందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. తీవ్రవాద దాడులు, మతమార్పిడి నెట్‌వర్క్ కార్యకలాపాల వంటివి గత చరిత్రేనని వివరించింది. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా జి20 సదస్సు కూడా నిర్వహించామని, దానికి ప్రపంచ దేశాల నుంచి అతిథులు హాజరయ్యారని గుర్తు చేసింది.

అంతకుముందు అంటే 2018 వరకు వేర్పాటు వాద మూకల కారణంగా 1767 రాళ్లు రువ్వే ఘటనలు చోటుచేసుకున్నాయని, 2023వాటిని సున్నాకు తీసుకురాగలిగామని తెలిపింది. 2018తో పోల్చితే భద్రతా బలగాల సంఖ్యను 65.9 శాతానికి తగ్గించగలిగామని లెక్కలతో వివరించింది. ఆర్టికల్ 370రద్దును వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్‌ను సమర్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News