Thursday, May 2, 2024

ఢిల్లీలో స్విట్జర్లాండ్ యువతి హత్య…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఉన్న 30 ఏళ్ల స్విట్జర్లాండ్ యువతి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. ఆమె హత్యకు సంబంధించి గురుప్రీత్‌సింగ్ అనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడి ఇంట్లోనుంచి 2.25 కోట్ల నగదును పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు పూర్వాపరాల ప్రకారం లీనాబెర్గర్ అనే స్విట్జర్లాండ్ యువతి వారం రోజుల కిందట భారత్‌కు వచ్చింది. అయితే శుక్రవారం పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని పోలీస్‌లు కనుగొన్నారు. ప్రభుత్వ స్కూల్ వద్ద ఉన్న చెత్తపడేసే నల్లని ప్లాస్టిక్ బ్యాగ్‌లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. గురుప్రీత్‌సింగ్ తరచుగా స్విట్జర్లాండ్ వెళ్లి లీనాను కలిసేవాడని తెలిసింది.

వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా ప్రేమవ్యవహారం నడుస్తున్నట్టు తెలియవచ్చింది. అయితే ఆమెకు మరొకరితో సంబంధం ఉందని అనుమానించి ఆమెను హత్య చేయాలని గురుప్రీత్‌సింగ్ ముందుగా పథకం పన్నాడు. భారత్‌కు రావాలని ఆమెను కోరాడు. దీంతో ఆమె అక్టోబర్ 11న ఢిల్లీ చేరుకుంది. ఐదు రోజుల తరువాత ఆమెను గదిలో ఉంచి ఆమెపై మ్యాజిక్ చేస్తానని నమ్మించి కాళ్లూ చేతులు కట్టేసి హత్య చేసినట్టు బయటపడింది. మరోవైపు ఆమె పేరుతో కొనుగోలు చేసిన పాత కారులో మృతదేహాన్ని దాచి ఉంచాడు. దుర్వాసన రావడంతో ప్రభుత్వ స్కూల్ ముందు చెత్తపారవేసే స్థలంలో ప్లాస్టిక్ బ్యాగ్‌లో మృతదేహాన్ని పారవేశాడు. సిసిటీవీ ఫుటేజి ప్రకారం పోలీస్‌లు ఆ మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి పారవేసినట్టు కనుగొన్నారు. కారు రిజిస్ట్రేషన్ నెంబరు గుర్తించి కారు యజమాని ఎవరో తెలుసుకున్నారు. రెండు నెలల క్రితం మృతురాలు తనకు కారు అమ్మిందని యజమాని చెప్పాడు. దాంతో గురుప్రీత్‌సింగ్‌ను అరెస్టు చేయగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News