Tuesday, May 14, 2024

కావేరీ జలాలు విడుదల చేయించాలని కేంద్రానికి తమిళనాడు అభ్యర్థన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ జలాలు విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు తమిళనాడు జల వనరుల మంత్రి దురైమురుగన్ అభ్యర్థించారు. బుధవారం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ను ఆయన కలుసుకుని ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ జూన్ నెలకు సంబంధించి తమిళనాడు 12,213 టిఎంసి (తౌజండ్ మిలియన్ క్యూబిక్ ) అడుగుల వరకు కావేరీ జలాలను పొందవలసిన అర్హత ఉందని , కానీ 2993 టిఎంసి అడుగుల వరకే పొందగలిగామని , ఇంకా 9220 టిఎంసి అడుగుల నీరు లోటు ఉందని చెప్పారు. జులై 3 నాటి వరకున్న పరిస్థితిని ఈ డేటా చెబుతోందన్నారు.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమిళనాడు కావేరీ డెల్టా ప్రాంతం తీవ్ర ప్రభావానికి గురవుతుందని మంత్రి పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కావేరీ జలాల యాజమాన్య అథారిటీ చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. ఈమేరకు కావేరీ జలాల యాజమాన్య అథారిటీపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రిని తాను కోరినట్టు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని మంత్రి మురుగన్ చెప్పారు. డిఎంకె మిత్ర పక్షమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకతో నేరుగా తమిళనాడు ఎందుకు సంప్రదింపులు జరపలేదని ప్రశ్నించగా, అది వీలుపడలేదన్నారు. తల్లీబిడ్డల సంబంధమైనా సరే ఆహారం , నీటి వంటి సమస్యల విషయంలో పరిస్థితి వేరేగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అందువల్ల ఆ ప్రకారమే వ్యవహరించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కావేరీ నదీ జలాల యాజమాన్య అధారిటీ ( సిడబ్లుఎంఎ)కి ఈ విషయమై లేఖ రాసింది.

రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమస్యపై సంబంధిత అధికారులను కలుసుకోనున్నారు. కర్ణాటక ప్రభుత్వమెకెడాటు డ్యాం ప్రతిపాదన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారా అని ప్రశ్నించగా తమిళనాడు మంత్రి మురుగన్ అది అవసరం లేదన్నారు. ఆ డ్యామ్‌ను కర్ణాటక నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి అవకాశం ఇవ్వబోదని నిర్ణయించినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News