బెంగళూరు: ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక 33 మహిళ ఇంట్లో నిద్రిస్తున్న తన తల్లిని కత్తితో పొడిచి చంపివేసి తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున ఇక్కడి కెఆర్ పురం సమీపంలోని రామమూర్తి నగర్లో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో 54 ఏళ్ల నిర్మల మరణించగా ఆమె కుమారుడు 31 ఏళ్ల సి హరీష్ చంద్రశేఖర్ తృటిలో హత్యాయత్నం నుంచి తప్పించుకుని కత్తిపోట్లకు గురయ్యాడు. హత్యకు పాల్పడిన అమృత ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం…దావణగెరెకు చెందిన నిర్మల తన కుమారుడు, కుమార్తెతో కలసి ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. మరాఠాహళ్లిలో ఉన్న ఒక ప్రముఖ ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమృత పనిచేస్తోంది. కొద్దిరోజుల క్రితం తనకు హైదరాబాద్లో వేరే ఉద్యోగం దొరికిందని, ఫిబ్రవరి 2న హైదరాబాద్కు అందరం బయల్దేరి వెళ్లాలని అమృత తన తల్లికి, సోదరుడికి తెలిపింది.
ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి భోజనం అయిన తర్వాత ముగ్గురూ నిద్రకు ఉపక్రమించారు. హరీష్ ఒక గతిలో నిద్రిస్తుండగా అమృత, వారి తల్లి హాలులో నిద్రిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఏదో అలికిడి అవుతుంటే హరీష్ నిద్రలేచాడు. తన గదిలోని టేబుల్ సొరుగులను అమృత గాలించడం కనిపించింది. దేనికోసం వెదుకుతున్నావని అతను ప్రశ్నించగా తన బ్యాగులను సర్దుకుంటున్నానని సమాధానం ఇచ్చి ఆమె గదిలో నుంచి వెళ్లి పోయింది. మళ్లీ 10 నిమిషాల తర్వాత గదిలోకి వచ్చిన అమృత బెడ్ మీద కూర్చుని ఉన్న హరీష్పై కత్తితో దాడి చేసింది. అతని మెడకు కుడి పక్కన ఆమె కత్తితో పొడిచింది. మరోసారి కత్తితో పొడవడానికి ఆమె ప్రయత్నిస్తుండగా అతను తప్పించుకుని గదిలో నుంచి బయటకు పరుగెత్తాడు. తల్లి కోసం గాలించగా ఆమె రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది.
తల్లిని తానే చంపేశానని అమృత అతనికి చెప్పింది. తాను రూ. 15 లక్షల అప్పు చేశానని, దాన్ని తీర్చేందుకు మార్గం లేకే తల్లిని హత్య చేశానని అమృత చెప్పింది. ఆదివారం ఉదయం అప్పుల వాళ్లు గొడవ చేసేందుకు ఇంటికి వస్తున్నారని, తన కుటుంబం నవుల పాలవుతుందని తాను భయపడుతున్నానని ఆమె హరీష్కు చెప్పింది. ఇంతలో ఆమెను పట్టుకోవడానికి హరీష్ ప్రయత్నించగా అమృత విదిలించుకుని పారిపోయింది. వెంటనే హరీష్ తన సమీప బంధువైన ఒక మహిళకు ఫోన్ చేయగా ఆమె వచ్చి హరీష్ను ఆసుపత్రిలో చేర్పించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా..ఒక చదువుకుని ఉద్యోగం చేస్తున్న మహిళ అప్పుల వాళ్లకు భయపడి తన తల్లిని హత్య చేసి తమ్ముడిని చంపడానికి ప్రయత్నించడం అత్యంత అరుదైన సంఘటని డిసిపి(వైట్ఫీల్డ్) ఎంఎన్ అనుచేత్ తెలిపారు. హరీష్ షాక్ నుంచి కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. అన్ని కోణాలలో దర్యాప్తు జరుపుతామని ఆయన తెలిపారు. అయితే అవివాహిత అయిన అమృత ఆరేళ్ల క్రితం తన తండ్రి మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలు భుజాన మోస్తోందని, తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నందుకు ఆమె మానసికంగా కృంగిపోయి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Techie kills mother and injures brother, Amrutha has killed her mother with knife and injured her brother in Bengaluru