జిహెచ్ఎంసి పరిధిలో పేషెంట్లకు రూ. 275, వైద్యసిబ్బందికి రూ.300
జిల్లాల్లో పేషెంట్లకు రూ.200, హెల్త్ వర్కర్లకు రూ.250
జి.ఓనెం 298ను విడుదల చేసిన ఆరోగ్యశాఖ
హైదరాబాద్ : కోవిడ్ పేషెంట్లకు డైట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న కోవిడ్ పేషంట్లకు, వారికి సేవలు అందిస్తున్న డాక్టర్స్, సిబ్బందికి ఈ చార్జీలు వర్తిస్తాయంటూ అధికారులు ప్రకటించారు. కోవిడ్ పేషంట్లు త్వరగా కోలుకోవడానికి మందులతో పాటు మంచి పౌష్ఠికాహారం అవసరం ఉందని, ఈమేరకే ధరలు పెంచినట్లు ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు.
కోవిడ్ పేషెంట్లకు ఇలా…
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు ఉదయం టిఫిన్, 11 గంటలకు స్నాక్స్, మధ్యాహ్నాం భోజనం, సాయంత్రం 4 గంటలకు డ్రైప్రూట్స్, రాత్రి భోజనంతో పాటు ప్రతి రోజు ఒక్కో రోగికి నాలుగు లీటర్ల మినరల్ వాటర్ని ఇస్తున్నారు. అయితే వీటికి ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో రూ.275, మిగతా జిల్లాల్లో రూ.200 చెల్లించేందుకు ప్రభుత్వం జి.ఓ నెం 298ను విడుదల చేసింది.
వైద్యసిబ్బందికి ఇలా….
కోవిడ్ పేషెంట్లు ఉంటున్న హాస్సిటల్స్లో పనిచేస్తున్న డాక్టర్స్, సిబ్బందికి కూడా భోజనం అందించేందుకు జిహెచ్ఎంసి పరిధిలో అయితే రూ. 300, మిగతా రాష్ట్రమంతటా రూ. 250 ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే గతంలో ఎంత చెల్లించారనేది అధికారులు ప్రకటించలేదు.
సిఎం సలహాలతో వైద్యారోగ్యశాఖ అద్బుతంగా పనిచేస్తుంది : మంత్రి ఈటల
సిఎం కెసిఆర్ సలహాలతో వైద్యారోగ్యశాఖ అద్బుతంగా పనిచేస్తుందని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. పేషెంట్లకు అన్ని సౌకర్యాలు అందిస్తూ, ప్రాణాలు పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. డాక్టర్స్, సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరిస్తూ చిత్తశుద్దితో పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Telangana increases diet expenses for Corona patients