Thursday, May 2, 2024

మహిళా సంరక్షణలో దేశంలోనే తెలంగాణ ది బెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళలు, పిల్లల సంరక్షణ విషయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భమైన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణపై ప్రభుత్వం అనేకానేక ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం మహిళలు, చిన్నపిల్లల సంరక్షణకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. షీ టీమ్స్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. మరోవైపు మహిళలు, పిల్లల సంరక్షణార్థం పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసి, ఒక సీనియర్ ఐపిఎస్ అధికారిని అడిషనల్ డిజి హోదాలో నియమించి, ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. ప్రస్తుతం షికా గోయల్ ఉమెన్ సేఫ్టీ వింగ్‌కి అడిషనల్ డిజిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తాజా గణాంకాల ప్రకారం తప్పిపోయిన పిల్లలు, మహిళలను గుర్తించడంలో దేశంలోనే తెలంగాణ ముందజలో ఉంది. మహిళలు మిస్సయిన సమాచారం వచ్చిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వెంటనే వాళ్ళని పట్టుకోగలుగుతున్నాయి. అలా తప్పిపోయిన వాళ్లలో 87 శాతం మందిని గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అందుకు మహిళా భద్రతా విభాగంలో ‘ప్రత్యేక పర్యవేక్షణ విభాగం’ ను ఏర్పాటవ్వడంతో పాటు ఒక ప్రత్యేకమైన డెడికేటెడ్ వాట్సాప్ నెంబర్‌ని కేటాయించడం జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం వచ్చిన ఆ నెంబర్‌కి సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తున్నారు. భారత దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు 25 శాతం ఈ అంశంలో ముందున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ శాతం ఇతర రాష్ట్రాల్లో 62 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.

అయితే మహిళలు మిస్ అవ్వటానికి బలమైన కారణాలు అనేవి ఉండకపోవడం ఆలోచించాల్సిన పరిణామం. కనిపించకుండా పోయిన పిల్లలు, మహిళలు చాలా మంది చిన్న చిన్న కారణాలతో ఇంట్లోనుంచి వెళ్తున్నారని వెల్లడవుతోంది. 99.9 శాతం మంది చిన్న చిన్న కారణాలతో ఇంట్లో నుంచి వెళ్తున్నారనేది నమోదైన ఫిర్యాదుల ఆధారంగా వెల్లడవువతోంది. టీనేజ్ అమ్మాయిలు మిస్ అవ్వటానికి ప్రధాన కారణం ప్రేమ విఫల మైందనో, కుటుంబ గొడవలు, ఆర్థిక సమస్యలు. కారణాలు ఏమైనా ఫిర్యాదు అందగానే కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తిస్తున్నట్లు అడిషినల్ డిజి శిఖా గోయల్ అంటున్నారు. అయితే గతంలో మాదిరిగా అమ్మాయిలను మాయ మాటలతో లోబరుచుకుని వారిని అక్రమంగా రవాణా చేసి ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో వ్యభిచార కూపాలకు అమ్ముతున్న సంఘటనలు దాదాపుగా లేవని ఆమె అంటున్నారు. గతంలో మాదిరిగా అవయవాల దోపిడీ కోసం కిడ్నాప్ చేయటం లాంటి ఘటనలు కూడా లేవని ఆమె స్పష్టం చేస్తున్నారు. మహిళల రక్షణ విషయంలో 24 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్‌లు విధులు నిర్వర్తిస్తున్న సంగతి విదితమే. దీంతో, పోకిరీల బెడదను నివారించడం సాధ్యమైంది. మరోవైపు మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదన్న ప్రభుత్వం ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు శాఖ అందునా ఉమెన్ సేష్టీ వింగ్ అహర్నిశలు మహిళలు, పిల్లల సంరక్షణ కోసం కృషి సల్పుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News