Tuesday, May 7, 2024

6 కోట్లు దాటిన ఐటి రిటర్న్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆదాయం పన్ను రిటర్న్‌లు (ఎటిఆర్)దాఖలు చేయడానికి గడువు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో రిటర్న్‌లు దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులు ఇపోర్టల్‌కు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్క రోజే 1.78 కోట్ల మంది ఇపోర్టల్‌లో లాగిన్ కాగా ఆదివారం కూడా పెద్దసంఖ్యలో లాగిన్ అయ్యారు. ఈ ఒక్క రోజే సాయంత్రం ఆరున్నర గంటల వరకు 1.30 కోట్ల మందికి పైగా ఇపోర్టల్‌లో లాగిన్ కాగా .. వారిలో 26.76 లోల మంది ఐటి రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఐటి శాఖ తెలియజేసింది.ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్క గంటలోనే 3 లక్షలకు పైగా రిటర్న్‌లు దాఖలయ్యాయని తెలిపింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఐటి రిటర్న్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య 6 కోట్ల మైలురాయిని దాటిందని ఒక ప్రకటనలో తెలిపింది.

పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లు దాఖలు చేయడానికి,పన్ను చెల్లింపులు, ఇతర సర్వీసుల కోసం తమ హెల్ప్‌డెస్క్ రోజులో 24 గంటలు తెరిచి ఉంటుందని తెలిపింది. అలాగే ఫోన్‌కాల్స్, లైవ్ చాట్‌లు,వెబ్‌ఎక్స్ సెషన్స్,సోషల్ మీడియా ద్వారా సంప్రదించవచ్చని ఐటి శాఖ తెలిపింది.ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది.గత ఏడాదిలో 7.4కోట్లకు పైగా రిటర్న్‌లు దాఖలు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 6 కోట్లకు పైగా రిటర్న్‌లు దాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా మంది ముందుగా రిటర్న్‌లు దాఖలు చేయలేకపోయారు. ఈ దృష్టా ఈ నెల 31తో ముగియనున్న రిటర్న్‌ల దాఖలు గడువును మరికొద్ది రోజులు పెంచుతారేమోనని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు గతవారం రెవిన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ గడువు పెంచాలనే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని, అందువల్ల పన్ను చెల్లింపుదారులందరూ వెంటనే రిటర్న్‌లు దాఖలు చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రిటర్న్‌లు దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులు ఎగబడుతున్నారు. అయితే గడువు ముగిసినప్పటికీ రూ.1000 పెనాల్టీతో రిటర్న్‌లు దాఖలు చేసే వీలుంటుంది. కనుక రిటర్న్‌లు దాఖలు చేసే వారి సంఖ్య చివరికి ఎంతకు చేరుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News