Wednesday, April 24, 2024

తెలంగాణ యక్షగాన గంధర్వుడు పనస హనుమద్దాసు

- Advertisement -
- Advertisement -

Telugu Story about Panasa Hanumaddasu

తెలంగాణ యక్షగాన రచయితలు, నాటకకారులలో చెప్పకోదగ్గవారు పనస హనుమద్ధాసు. జానపదకవికూడా. సజీవమైన ప్రజలభాషలో జానపద కళారూపాలైన యక్షగానాలను రాశారు. సరస శృంగార కోలాటకీర్తనలను రాశారు. భక్తిరసపూర్ణమైన భజనకీర్తనలను రాశారు. అద్భుతమైన తన గానవాహినిలో సుమారు ఆరున్నర దశాబ్దాలపాటు తెలంగాణ ప్రజలను ఓలలాడించిన యక్షగాన గందర్వుడు పనస హనుమద్ధాసు గారు. వీరు క్రీ.శ 1904 పిబ్రవరి 25న రామవ్వ -లక్ష్మయ్య దంపతులకు పుట్టారు. వీరిది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా యెల్లారెడ్డిపేట మండలంలోని మానేరు ఒడ్డునగల సింగారం గ్రామం.

హనుమద్ధాసు తల్లిదండ్రులది సామాన్య కుటుంబం. వీరిది ఇమ్మడిశెట్టి గోత్రం. ఇంటిపేరు పనస. పనసవారు,రుంజువారు విశ్వబ్రాహ్మలపేరు చెప్పి తమ తెలివితేటలతో వారిని మెప్పించి యాచించి బతికేవారు. లక్ష్మయ్య కుటుంబం కొన్నిరోజులు నల్లగొండజిల్లా భువనగిరి ముత్తారెడ్డి గూడెంలో జీవనం సాగించింది. హనుమద్ధాసు బాల్యంలో అనేక కష్టాలుపడ్డాడు. హనుమద్ధాసు అబ్దుల్ కరీం దగ్గర చదువుకున్నారు. కరీంది బండలింగంపల్లి .హనుమద్ధాసుది సింగారం. ఈ రెండు ఊర్లమధ్య మానేరు వాగు పారుతుంది. 2కిలోమీటర్ల దూరం. హనుమద్ధాసు తండ్రి లక్ష్మయ్యకు కరీంకు మంచి స్నేహం. హనుమద్ధాసు కుటుంబం గురించి తె లుసు కావున కరీం ఒక్కరూపాయి తీసుకోకుండానే చ దువు చెప్పాడు. మూడేండ్లు హనుమద్ధాసు నేర్చుకున్నా డు.పెద్ద బాలశిక్ష ,గణితం,శతకాలు్, వ్యాకరణం, ఛం దస్సు, జ్యోతిష్యం,వైద్యం నేర్చకున్నారు. అబ్దుల్ కరీం బంగారం పని,వెండిపని,కంచరిపని, వడ్లపని ,చిత్రకారిపనులు నేర్చుకున్నాడు. రాత్రివేళల్లో పురాణ పఠనం చే సేవారడు. హరికథాగానం చేసేవాడు. గురువు విద్యలు శిష్యుడు హనుమద్ధాసు ఒంటపట్టించుకున్నాడు. అట్లాం టి ఆదర్శమూర్తికి ప్రియమైన శిష్యుడు హనుమద్ధాసు.

అప్పుడు వారి గ్రామంలో కోలల వెంకన్న కోలు నేర్పుతుండేవాడు. అప్పటికే భజన సమాజాల్లో హనుమద్ధాసు పాల్గొంటున్నాడు. గాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు. కోలల వెంకన్న వద్ద కోలు వేయడం నేర్చుకున్నాడు. కో లలువేయడంలో తెలివి సాధించినాడు.హనుమద్ధాసు ఏకసంతాగ్రాహి. గురువులు ఏమిచెప్పిన వెంటనే పట్టేసేవాడు.పనసహనుమద్ధాసు పెళ్లి చేసుకునేనాటికి 11 సంవత్సరాలు. తల్లి రామవ్వ తంబాకు నష్యం అమ్మేది.తండ్రి హనుమద్ధాసుబాల్యంలో ఉన్నప్పుడే చనిపోయాడు. బంధువులందరు కులవృత్తి చేసుకొమ్మని ఒత్తిడి చేశారు. హనుమద్ధాసు తెలివితేటలు,గుణగణాలు చూసిన మేనమామ తన కూతురును హనుమద్ధాసుకిచ్చి పెళ్లి చేశాడు. వెంకవ్వను హనమద్దాసుకిచ్చి పెళ్లి చేసేనాటికి 11 సంవత్సరాల వయస్సు. ఈ పెళ్లికి హనుమద్ధాసు 150 రూపాయలు అప్పుచేశాడు. అప్పు ఎలా తీర్చాలో అంతుపట్టలే దు. తల్లి నష్యం తంబాకు అమ్మకంతో పొట్టమాత్రమే గడిచేది. కోలలువేయడం నేర్చుకుని,కోలల పంతులు స్థాయికి ఎదిగి 350రూపాయల అప్పను వడ్డీతో సహా తీర్చాడు. వివిధ గ్రామాలకు వెళ్లి కోలలు వేయడం, జడకొప్పు వేయడంలాంటివి నేర్పించాడు. వెంకవ్వకు సంతానం కలుగకపోవడంతో అనసూయను పెళ్ళి చేసుకున్నాడు.

పనసహనుమద్ధాసు ఏకసంతాగ్రాహి కావున పాండి త్యం సంపాదించాడు. ఆశువుగా కవిత్వం అళ్లాడు. యక్షగానాలను నేర్చుకుని నటుడయ్యాడు. కోలాట కీర్తనలను రాస్తూ ‘రుక్మాంగద‘నాటకం రాసి బండలింగంపల్లి గ్రామానికి అంకితం చేశాడు. చోళభూపతి విశ్వకర్మ యక్షగానం రాసి ఎల్లారెడ్డిపేటకు అంకితం ఇచ్చాడు. కేవలం 20 సంవత్సరాల వయస్సులోనే కోలలపంతులుగా యక్షగాన రచయిత,నటునిగా,కరీంనగర్,నిజామాబాద్,మెదక్ జిల్లాల్లో పేరు పాకింది.
కోలాటాలు,యక్షగానాలు నేర్పుతూ కామారెడ్డి, అక్కడినుండి చుట్టుపక్కల ఊర్లకు వెళ్లాడు.పాండవారణ్య నాటకం రాసి ఉప్పలవాయి గ్రామానికి అంకితం ఇచ్చాడు. మధుసేన నాటకం రాసి సదాశివ నగర్ ఊరుకు అంకితం ఇచ్చాడు.శకుంతల నాటకం రామేశ్వరంపల్లికి అంకితం ఇచ్చాడు. బాలనాటకం మాణిక్ బండారు ఊరుకు అంకితం ఇచ్చాడు. హనుమధ్రామసంగ్రామం గోసాన్ పల్లికి అంకితమిచ్చాడు.

హనుమద్ధాసు 31 యక్షగాన నాటకాలును 25కు పైగా ఇతర రచనలను చేశారు. పాండవ అరణ్యవాస నాటకం శ్రీ తిరుపతి వెంకటేశ్వర మహాత్మ్యం నాటకం,అనసూయ నాటకం,శ్రీ బాలరాజు నాటకం,బొబ్బిలి నాటకం, అల్లీరాణి పరిణయ నాటకం,గుణసుంధరి నాటకం, బలుగూరి కొండయ్య నాటకం,చంద్రకాంతమహరాజు నాటకం, శకుంతల యక్షగాన నాటకం, కాంబోజరాజు చరిత్ర నాటకం, జయంత జయపాల నాటకం, భక్తకేతన విజయ నాటకం,కురుక్షేత్ర నాటకం,భూకైలాస నాటకం,శ్ర భక్తమాదవనాటకం, శ్రీ డాంగ్నేయోపాఖ్యానం యక్షగానం,వీరబ్రహ్మం చరిత్ర నాటకం, పాలన చోళ మహరాజు చరత్ర యక్షగానం, వీరప్ప అసంపూర్ణ యక్షగానం,హనుమద్ధాసు అసలీ కోలల కృష్ణలీలలు, ఖానాపురి కోలాటకృష్ణలీలలు, చిరుతల బాలనాగమ్మ ఇవేగాకుండా జానపదగేయాలపుస్తకాలు 5, భజనకీర్తనల పుస్తకాలు 5 బతుకమ్మ పాటలు 7, మంగళహారతుల పుస్తకాలు 2 శతకాలు్ 3, కథ 1, జీవిత చరిత్ర వీలునామా 1, వైద్య గ్రంథం 1 మొత్తం 25 పుస్తకాలు రాశాడు. హనమద్దాసు రచనలు చేసినప్పటికీని నాదేమి ఘనత లేదంటాడు. కవులకు నమస్కరించాడు.ఒక పద్యంలో ఇలా చెప్పాడు.‘కృతి యొనర్చి రెండు వింశతులు వాణి/కరుణతోగాని నాదేమి ఘనతలేదు/ తప్పులున్నను మన్నించి చెప్పరయ్య/ కవికులనుజేతు నా నమస్కారమెప్పుడు’/ ఈ విధంగా తనకు చాలా పేరు వచ్చిందనీ మరొక పద్యంలో చెప్పాడు.

రాగలక్షణమేమి రాదు ఈనాటికి/ పాటకుండను పేరు ప్రభలమాయె/ వైద్యశాస్త్రమేమి వల్లించకున్నను / ఘనవైద్యుడను పేరుగాంచినాను/ ఛందో వ్యాకరణముల్ చదువను కావ్యాలు/ కవియను ఘనతను గాంచినాను హనుమద్ధాసు స్వయంగానే సంగీత పరిజ్ఞానం సంపాదించాడు. ఆదితాళం,ఆట, ఏక, రూపక, జల్వ, త్రిపుట, జంపె తాళాలు, బైరవి రాగం, మోహనరాగంతో రచనలు చేశాడు. అలాగే మహాకీర్తిని పొందినప్పటికీ పేదరికం వెంటాడిందన్నాడు. అయినా కలిమి లేములు వస్తూపోతుంటాయన్నాడు. వేదాంతాన్ని ఒక పద్యంలో చెప్పాడు. / ‘జనని గర్భము నుండి జనన మొందిన నుండి సుఖకాలమును జూడనైతి చిన్నతనమునతల్లి నన్ను బెంచిననాడు నిరుపేదతనముతో నిలిచినాము’ కురుక్షేత్రం నాటకంలో హనుమద్ధాసు సులభమైన పదాలతో చక్కగా పద్యాలు రాశాడు. శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్లినప్పుడు ధర్మరాజు తన మనోగతాన్ని తెలుపుతున్న సందర్భంలో ఒక పద్యంలో ఇలా ఉంది.‘యేకంబుగా భూమి యేలుచునున్నట్టి/తల్లిదండ్రికి ప్రణమిల్లితనుము /వనవాస అజ్ఞాతవాసంబు గడిపియు/ పడరాని యిడుములంబడితిమనుము/తనగౌరవము నిల్పి ధరణి పాలించిన /పాండుభూపతి పాలు పంచుమనుము/పరులబోధలు విని పాండవేయులతోడ/ కయ్యంబు బూనంగ గాదటనుము /గానమాపాలుమాకివ్వఘనమటనుము /కోర్కెమీరంగ తమ్ముని కొడుకులనుము/ ఐదుగురికైదు గ్రామంబులడిగితనుము/ ప్రకటబలులము వేణుగోపాలవినుము / హనుమద్ధాసు వృత్త, జాతి, ఉపజాతులకు చెందిన ఛందస్సులో రాశాడు. అలాగే ఉపమ,రూపక, ఉత్ప్రేక్ష, శ్లేష, అర్థాంతర, అంత్యానుప్రాసం మొదలగు అనేక అలంకారాలనుపయోగించాడు. చాయిమీద దండకం రాశాడు.

‘శ్రీదేవి! వోదేవి! శ్రీలక్ష్మీ భూదేవి!/ నీ కీర్తి వర్ణించనేనెంత జగమంత వ్యాపించినావమ్మ‘ అంటూ సాగుతుంది. /హనుమద్ధాసు నాటకాలు నేర్పుతున్నకాలంలో నటులను తయారుచేయడమే పనిగా పెట్టుకున్నాడు. హనుమద్ధాసు అవసరమైతే ఏపాత్రనైన ధరించి నాటకాన్ని రక్తికట్టించేవాడు. అతనికి బాలనాగమ్మ నాటకమంటే అభిమానం.ఈనాటకంలో ఫకీరు పాత్ర అంటే ఇష్టం. ఈ పాత్రను పోషించేటప్పుడు తనకు తెలిసిన టక్కులు టమారాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేవాడు. ఆ కాలంలో మాదిగ చిందులు,దాసరులు,ఎర్రగొల్లలు,శారదకాండ్రు మొదలగువారు పెద్ద పెద్ద ఊర్లను కేంద్రాలుగా చేసుకుని నాటకాలు ఆడేవారు. ఆకాలంలో సురభినాటక కంపెనీవారుకూడ నెలలతరబడి ఆడేవారు. ఆస్ఫూర్తితో పెద్దపెద్ద గ్రామాల్లో హనుమద్ధాసు నాటక ప్రదర్శనలు చేయించేవాడు.

హనుమద్ధాసు నటుడుగా,రచయితగా, ప్రయోక్తగా రాణిస్తున్న సంతృప్తిపడలేదు. బండలింగంపల్లిలో తన గురువు అబ్దుల్ కరీంవద్ద నేర్చుకున్న వైద్యం తీరిక సమయాల్లో ఇతరులకు చేసేవాడు. పాముకరిచి వచ్చినవారిని ఆకుపసరు వైద్యంతో రక్షించేవాడు. అలాగే ‘పాముకాటుకు భయంలేదు‘ అనే పుస్తకం రాశాడు. కేవలం ఆయుర్వేదవైద్యంతో సంతృప్తి పడకుండా అల్లోపతికూడా నేర్చుకుని సూదిమందు వైద్యం చేశాడు.

హనుమద్ధాసు కోలలపంతులునుండి నటుడుగా,రచయితగా,ప్రయోక్తగా మారాడు. కోలలపంతులుగా ఎంతోమంది శిష్యులను తయారుచేశాడు. తాను స్వయంగా నటునిగా పాల్గొన్నాడు. ప్రదర్శనలిచ్చాడు. అనుకున్నది సాధించాలన్న మనస్తత్వం కలవాడు. నటనలో పట్టు సాధించాడు. పెద్ద చదువులు చదువకున్న వీధిబడిలో తన గురువు కరీంవద్ద నేర్చుకున్న కొద్దిపాటి చదువుతో తాను ప్రతిభకు పదునుపెట్టాడు. రచనవైపు తన మనస్సు మల్లింది. నేర్చుకున్న కొద్దిపాటి వ్యాకరణం, ఛందస్సుకు ప్రతిభ తోడైంది. ఆశువుగా పద్యాలు చెప్పడం,కీర్తనలు రాయడం చేశాడు.యక్షగాన రచయితగా పేరు సాధించాడు. కేవలం 20సంవత్సరాల వయస్సునాటికే కోలల పంతులుగా,యక్షగాన రచయితగా,నటునిగా కరీంనగర్ జిల్లానుండి నిజమాబాద్ జిల్లాకు పాకింది. సంచార జీవనం సాగించాడు. కళనే ఆరాదించాడు. తను ఏ ఊరు వెల్లితే ఆ ఊరికి నాటకం రాసి అంకితం ఇచ్చాడు. అక్కడి కళామండళ్ళు నాటకాలు ప్రచురించేవి., ఆదరించేవి. హనమద్దాసును మాణిక్ బండారు గ్రామం ఆహ్వానించగా 16 సంవత్సరాలు అక్కడనే ఉన్నాడు. బాలనాగమ్మ నాటకం అంకితం ఇచ్చాడు. ఎల్లారెడ్డిపల్లె నాటక సమాజంవారు తమ గ్రామానికి ఆహ్వానించి ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని అందించి సహకరించారు. గ్రామాలకు గ్రామాలే హనుమద్ధాసును ఆదరించాయి. హనమద్దాసు తన రచనలు చేయడమేగాకుండా ఇతర రచయితలు రాసిన పుస్తకాలను పరిష్కరించినాడు.

హనుమద్ధాసు రాసిన నాటకాలు అటు కరీంనగర్ జిల్లా, ఇటు నిజమాద్ జిల్లా,మెదక్ జిల్లాలతోపాటు తెలుగు సమాజంలో ప్రదర్షించబడ్డాయి. ఈయనకు ఎక్కువ పేరు తెచ్చిన నాటకం బాలనాగమ్మ. తర్వాత హనుమధ్రామసంగ్రామం, బొబ్బిలి యుద్ధం, వెంకటేశ్వర మహా త్మ్యం పేరు తెచ్చి పెట్టాయి. ఇవి ఆనాడు ప్రదర్షింపబడని ఊర్లు లేవంటే ఆశ్చర్యం. బాలనాగమ్మ నాటకాన్ని పుస్తకరూపంలో చూసిన కొందరు సినీ ప్రముఖులు కారులో యెల్లారెడ్డిపల్లెకు వచ్చి హనుమద్ధాసును తమతో తీసుకెళ్లారనీ అంటారు. ఆసినీప్రముఖులు హనమద్దాసు తో చేసుకున్న ఒప్పంద వివరాలు తెలియరాలేదు. హనమద్దాసు రచనలపై ప్రదర్శనలిచ్చిన నాటక సమాజంవా రు వేదికపైననే సన్మానించేవారు. హనుమద్ధాసు వదిన కుమారుడు బండారు రఘుపతి రాసిన‘ తిరుమల వెంకటేశ్వర శతకం‘ నందిపేట మండలం ఐలాపూరులో జరుగగా రఘుపతిహనుమద్ధాసునుఘనంగాసన్మానించాడు. 1977లో ఇందూరు కళాభారతివారు సన్మానకార్యక్రమాన్ని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిజమాబాదులో నిర్వహించారు. ఆసభకు జిల్లాకలెక్టర్ టి.వి ఆనంద్ కుమార్, డి.ఆర్.ఒ జి.నారాయణరావుగార్లు అతిథులుగా రాగా ఆ సభలో బోగం రాంబాయి , చిందు యెల్లమ్మలతోపాటుగా పనస హనుమద్ధాసును ఘనంగా సన్మానించారు.

1984లో నిజమాబాదులో కోలాట ప్రదర్శన చేయిస్తుండగా వృద్ధాప్యంలో ఉన్న హనుమద్ధాసు కార్యధీక్షను చూసిన నటరాజ రామకృష్ణగారు ప్రశంసించారు. తన పలుకుబడితో వృత్తి కళాకారులకిచ్చే పెన్షన్ మంజూరు చేయించారు. హనుమద్ధాసు మరణించేవరకు పెన్షన్ పొందారు. పనస హనుమద్ధాసు ప్రతిభను,కళను,రచనాశక్తిని చూసిన చాట్ల నర్సయ్య, రచయిత& తెలుగు ఉపన్యాసకులు ‘పనస హనుమద్ధాసు రచనలు- పరిశీలన ‘ అను అంశంపై ఉస్మానియావిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ రుక్నోద్దీన్ గారి పర్యవేక్షణలో పరిశోధనచేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆతర్వాత పుస్తకాలు ప్రచురించి ఆవిష్కరించి హనుమద్ధాసు కళాకృషికి పట్టంకట్టారు. అలాగే ఆయన పుట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా, యెల్లారెడ్డిపేటమండలం , సింగారం గ్రామంలో రచయిత డాక్టర్ వాసరవేణి పర్శరాములు సూచనతో గ్రంథాలయంకు ’పనస హనుమద్ధాసు గ్రంథాలయం‘అని గ్రామ ప్రజలు నామకరణం చేసి గౌరవించారు. తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు హనుమద్ధాసు గారి జయంతి ,వర్ధంతి నిర్వహిస్తూ గౌరవిస్తున్నారు. సెమినార్ నిర్వహించారు. హనుమద్ధాసు 70 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అతని ఆరోగ్యం కుంటుపడింది. పుత్ర సంతానం లేదనే మానసిక వేదన తోడైంది. 25-4-1973న ఒకసారి, 10-06-1973న మరొకసారి వీలునామాలు రాశాడు. తన భార్యలను పోషించినవారికే తన ఆస్థిపాస్తులు చెందుతాయని రాశాడు. హనమద్దాసు పెద్దకూతురు సావిత్రి, చిన్న కూతురు సాయమని. హనుద్ధాసు కూతురు సాయమని తండ్రితో ఉండి సేవలు అందించింది.

వీలునామా ప్రకారం ఆస్థి ఆమెకే సంక్రమించింది. 1973 తర్వాత హనుమద్ధాసు తన ప్రియ శిష్యుడు పుత్ర సమానుడైన రఘుపతికి దగ్గరగా ఉండాలనే అవసాన కాలంలో యెల్లారెడ్డిపల్లెనుండి మకాంను నందిపేట మండలంలోని అయిలాపూర్ గ్రామానికి మార్చాడు. యెల్లారెడ్డిపల్లెల్లో ఉన్న ఇల్లుని 2 ఎకరాల భూమినీ అమ్మగా వచ్చిన 10వేల రూపాయలతో అయిలాపూర్లో ఒక ఇంటిని, ఒక ఎకరం పొలాన్ని కొనుకున్నాడు. అక్కడ వృద్ధాప్యంలోకూడా నాటకాలు నేర్పడం మానలేదు. యక్షగానాలు, శతకాలు్, బతుకమ్మ పాటలు రాశాడు. హనమద్దాసుగారి జీవితంలో 65సంవత్సరాలకు పైగా సాహిత్య, సాంస్కృతిక,నాటక రంగానికి సేవచేశాడు. అదే సమయంలో వైద్యం చేశాడు. సమాజసేవలో తనవంతుపాత్రను సమర్థవంతంగా నిర్వహించారు. ఎనబై సంవత్సరాలకు పైగా సంపూర్ణ జీవితం గడిపిన హనుమద్ధాసు 02 -01-1985 రోజున అయిలాపూర్లోని స్వంత ఇంటిలో మరణించాడు. తెలంగాణలో చెర్వరాల భాగయ్య తర్వా త యక్షగానాలను రచించిన నాటక రచయితగా పేరుగాంచాడు.హనుమద్ధాసు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

డా.వాసరవేణి పర్శరాములు- 9492193437

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News