Saturday, April 27, 2024

యస్ బాస్‌ల కాలం చెల్లింది

- Advertisement -
- Advertisement -

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) భారత స్వతంత్ర దర్యాప్తు సంస్థ. కానీ ఇటీవల అది స్వతంత్రత లేని దర్యాప్తు సంస్థగా మారిపోయింది.దర్యాప్తు సంస్థల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మన దేశంలో ఉన్నంతగా ఎక్కడా ఉండదేమో. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థి పార్టీలపై అస్త్రాలుగా ఈ స్వతంత్ర సంస్థల్ని వినియోగించుకోవడం ఆనవాయితీ అయిపోయింది. దీంతో అధికారంలో ఉన్నవారికి ఆ సంస్థలు జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సిబిఐ కేసులతో కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం జైలుకు వెళ్లారు. ఆయన్ను జైలుకు పంపించడంలో కీలకపాత్ర మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దే. తనను ఒకప్పుడు ఏ సంస్థతో అయితే చిదంబరం జైలుకు పంపించారో, ఇప్పుడు అదే సంస్థతో ఆయన్ను జైలుకు పంపించడంలో షా విజయవంతమయ్యారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇదే ఒరవడి అనుసరిస్తున్నారు.

వాస్తవానికి ఇలా దర్యాప్తు సంస్థల్ని సొంతానికి వినియోగించుకోవడం మొదలైంది మాత్రం కాంగ్రెస్ హయాంలోనే. పదేళ్ల యుపిఎ పాలనలో సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేసినంతగా ఏ సర్కారూ చేయలేదు. తమ మాట వినని, తమ దారికి రాని నేతలపై సిబిఐ, ఇడిలను ప్రయోగించి ఇబ్బందులు పెట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ఈ వ్యవహారంపై పలు విమర్శలు, ఆరోపణలు చేసింది. ఇక యుపిఎకు అధికారం పోయి బిజెపి గద్దెనెక్కింది. అప్పటి వరకు ఉన్న ఈ దుస్సంప్రదాయాన్ని కొత్త సర్కారు మారుస్తుందేమోనని చూసినవారికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని బిజెపి సైతం నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఎందుకంటే ప్రత్యర్థుల ఆట కట్టించడానికి బ్రహ్మాండంగా అక్కరకొచ్చే ఈ బ్రహ్మాస్త్రాలను ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? అందుకే బిజెపి సైతం అదే బాటలో పయనిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిజెపిలో చేరినవారి కేసులకు సంబంధించి ఎలాంటి కష్టాలూ ఉండకపోవడమే ఇందుకు నిదర్శనం.

బిజెపిలో చేరక ముందు వరకు ఉన్న కేసులు కాషాయ కండువా కప్పుకోగానే పక్కకు వెళ్లిపోతున్నాయి. దీంతో తమ భద్రత దృష్ట్యా పలువురు బిజెపి బాట పడుతున్నారు. ఇలా దర్యాప్తు సంస్థల బూచితోనే భారత్ లో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ ఒరవడికి ముగింపు ఎప్పుడు పడుతుందో చెప్పలేం. ఎందుకంటే మొన్న చిదంబరం చేశారు. ప్పుడు షా చేస్తున్నారు. రేపు మరొకరు చేస్తారు. అధికారంలో ఎవరున్నా ఈ వ్యవహారం మాత్రం కామన్‌గా కొనసాగడం ఖాయం. అయితే ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇడి డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు అక్రమమంటూ మోడీ సర్కారుకు మొట్టికాయలు వేస్తూ జస్టిస్ బిఆర్ గౌరవ్, జస్టిస్ విక్రవ్‌ు నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై 11, మంగళవారం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వును కొట్టిపారేసింది. అంతేగాక, ఈ నెల 31న సంజయ్ కుమార్ మిశ్రా ఇడి డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈలోగా ఇడి నూతన డైరెక్టర్ నియమకాన్ని పూర్తి చేయాలని కేంద్రానికి సూచించింది. దాంతో సంజయ్ మిశ్రా ఈ నెల 31న తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 18 వరకు సంజయ్ మిశ్రా ఇడి డైరెక్టర్‌గా కొనసాగేవారు. ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. సిబిఐ, ఇడి డైరెక్టర్‌ల నిర్ణాయక రెండేళ్ల పదవీకాలం పూర్తయ్యాక మరో మూడేళ్ల పాటు వారి పదవీ కాలాలను పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను కట్టబెట్టిన చట్టాలకు సవరణలు జరిగిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

అయితే ఈ తీర్పుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ ఎవరన్నది ముఖ్యం కాదని, అక్కడ ఎవరున్నా వంశపారంపర్యంగా కులాసాగా, ధిలాసాగా రాజ్యాలు ఏలుతున్నవారి అవినీతి కోటలను బద్దలుకొట్టి తీరుతారని, డైరెక్టర్ సంజయ్‌మిశ్రా పదవీ కాలం పొడిగింపులను సుప్రీంకోర్టు తప్పుబట్టి, అది అక్రమం అని నిర్ధారించిన నేపథ్యంలో విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని హోం మంత్రి ప్రజలకు గుర్తుచేశారు.

ఇప్పుడు మిశ్రా పోయినా, ఆ స్థానంలో వచ్చిన వారు మిమ్మల్ని వదిలి పెట్టరన్న హెచ్చరిక కూడా హోం మంత్రి మాటల్లో విపక్షాలకు వినిపించే ఉంటుంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేమంటే మిశ్రా కాకపోతే మరొకరు అని ఇంత సులువుగా తేల్చేసిన అమిత్ షా అదే మిశ్రాకు సుప్రీంకోర్టు కూడదన్నా సరే పొడిగింపులు ఇవ్వడం ఎందుకు, ఆయన కోసమే ఓ ఆర్డినెన్సు తేవడం ఎందుకు అన్నదే అంతు చిక్కని ప్రశ్న. హోం మంత్రి ప్రవచించినట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యక్తికి అతీతమైన ఉన్నత వ్యవస్థే కావచ్చును కానీ, తమ ఆదేశాలను శిరసావహించే అస్మదీయులకు దానిని అప్పచెప్పినప్పుడే దాని ఔన్నత్యం దిగజారిపోయింది. ప్రభుత్వం అభ్యర్థన మేరకు, అధికారాల బదలాయింపు సవ్యంగా జరిగేందుకు సంజయ్ మిశ్రాను ఈ నెల చివరి వరకూ ఉండనిచ్చింది సుప్రీంకోర్టు.

నవంబర్ వరకూ కొనసాగనివ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు సరేనంటే తన తీర్పుకే అర్థం లేకుండా పోతుంది. వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అని ఇప్పుడు హోం మంత్రి గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ, కేవలం ఈ వ్యక్తి కోసమే ఆయన ప్రభుత్వం అన్ని సంప్రదాయాలను, నిబంధనలను తుంగ లో తొక్కింది. పైగా న్యాయ వ్యవస్థను, పార్లమెంట్‌ను అవమానపరిచి అస్మదీయుడి పదవీ కాలాన్ని తమకు నచ్చినంత కాలం పొడిగించుకున్నది కాక, ఇంకా ఉండాలంటూ న్యాయ పోరాటాలు కూడా చేస్తోంది. అవినీతిని చీల్చి చెండాడుతున్న మిశ్రాను తప్పించడానికి అవినీతిపరులంతా ఏకమయ్యారని రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ, ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని న్యాయస్థానాల్లో వాదిస్తోంది. డైరెక్టర్‌గా రెండేళ్ళ పదవీకాలం పూర్తయిన తరువాత ఆయనను వదిలి పెట్టి ఉంటే, వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అన్నమాటలకు అర్థం ఉండేది. కానీ మరో ఏడాది పొడిగింపు కోసం 2018 నాటి నియామక ఉత్తర్వులను మూడేళ్ళకు వర్తించేలా వెనక్కుపోయి మరీ సవరించింది. సుప్రీంకోర్టు ఈ చర్యను కాదనకుండానే 2021 నవంబరు 17 తరువాత ఆయన ఆ పదవిలో కొనసాగకూడదని ఆదేశించింది. దీనికి విరుగుడుగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పట్టుమని పదిహేను రోజుల్లో ఉండగా, రెండు ఆర్డినెన్సులతో ఇడి, సిబిఐ సంచాలకుల పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పెంచింది. దానితో పాటు ఏడాదికొకసారి చొప్పున మూడుసార్లు గడువు పొడిగించుకొనే వెసులుబాటు కూడా పాలకులకు కల్పించుకున్నారు.

ప్రతిపక్ష నాయకులను ఎంతగా వేధిస్తే అన్ని పొడిగింపులు అందుకోవచ్చన్న సందేశం ఇందులో ఉన్నదని విపక్షాలు అప్పట్లోనే విమర్శించాయి. ఉద్యోగ కాలాన్ని పెంచడం దేశ శ్రేయస్సుకు ఉపకరించేదే అయితే ఆ సవరణలేవో పార్లమెంటులో చర్చించే చేయవచ్చు కదా? అసాధారణ పరిస్థితుల్లోనే ఆర్డినెన్సులు చేయాల్సిన పాలకులు మిశ్రాను నిలబెట్టుకోవడానికే దానిని వాడారన్నది వాస్తవం. ఆయన ఆధీనంలో రెండు వేలకు పైగా దాడులతో, రూ. 65 వేల కోట్ల ఆస్తులను ఇడి అటాచ్ చేసి కొత్త సిబిఐగా అవతరించిన మాట నిజమే కానీ, అందులో విపక్ష నేతలు, ఆయా పార్టీలతో అనుబంధం ఉన్న సంస్థలు ఎన్నో, బిజెపి శ్రేయోభిలాషులు, అనుకూల కార్పొరేట్ సంస్థలు కూడా ఎన్నో లెక్క విప్పితే బాగుంటుంది. ఇప్పటి వరకూ మనీలాండరింగ్ ఆయుధంతో ఇడి అడుగుపెట్టని విపక్ష రాష్ర్టమంటూ దేశంలో ఏదీ మిగల్లేదు. 2021 తరువాత మిశ్రా కొనసాగింపు అక్రమం, చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించిన నేపథ్యంలో, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా అక్రమమే అవుతాయి కదా. మిశ్రా తీసుకున్న నిర్ణయాలపై స్వతంత్ర న్యాయవిచారణ జరపాలన్న డిమాండ్ రాజకీయపరమైనదే కావచ్చు కానీ, అర్థం లేనిదైతే కాదు. సివిసి చట్టంలో సవరణలను సుప్రీంకోర్టు సమర్థించిందని పాలకులు గుర్తుచేస్తున్నారు కానీ, ఆ సవరణల వెనుక ఒక వ్యక్తి కొనసాగింపు లక్ష్యం ఉన్న విషయం న్యాయస్థానానికి కూడా తెలుసు, శాసనం చేసుకొనే హక్కును అది కాదనలేకపోవచ్చు కానీ, ఆ వ్యక్తి కొనసాగింపును న్యాయస్థానం తప్పుబట్టడం కేంద్ర ప్రభుత్వానికి అవమానకరమైనదే. న్యాయస్థానం తీర్పు మిశ్రాకు పరిమితమైన అంశమే కావచ్చు. కానీ, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఆయా సంస్థలను యస్ బాస్‌లతో నింపుతూ వాటిని ఆయుధాలుగా వాడుతున్నారనడానికి మిశ్రా ఉదంతమే ఒక నిదర్శనం.

– నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News