Thursday, May 2, 2024

మతోన్మాదంపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

There is no place for religious politics in Hyderabad:KTR

విద్వేషాలు రెచ్చగొట్టేవారి అంతు చూస్తాం: మంత్రి కెటిఆర్

బహదూర్‌పుర
ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్‌లో మత రాజకీయాలకు చోటులేదు
వారసత్వ కట్టడాలను రక్షించుకుంటాం
మొజాంజాహి మార్కెట్‌ను అభివృద్ధి చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే
పాతబస్తీని కొత్త సిటీ తరహాలో సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నాం : మంగళవారం నాడు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: పాతబస్తీని కొత్త సిటీ తరహాలో సమాతరంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎనలేని కృషి చేస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధ్దిశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఒకే రోజు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ.495.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన వెల్లడించారు. పాతబస్తీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కెటిఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా రూ.180 కోట్ల వ్యయంతో నిర్మించిన బహదూర్‌పురా ఫ్లైఓవర్‌తో పాటు మీర్ ఆలం చెరువు వద్ద రూ.2.55 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెన్‌తో పాటు మిరాలం ట్యాంక్ వద్ద సెకండరీ కలెక్షన్, ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను హోం శాఖమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రూ. 389.20కోట్ల విలువైన 6 పనులకు కెటిఆర్ శంకుస్థాపనలు చేశారు.

ఇందులో భాగంగా రూ. 36 కోట్ల వ్యయంతో ముర్గీ చాక్ పునర్ నిర్మాణం, రూ.21.90 కోట్లతో మిరాలం మండి అభివృద్ధ్ది, సర్ధార్ మహాల్ రిస్టోరేషన్, జోన్ 3పరిధిలో రూ.297.30 కోట్ల వ్యయంతో సీవరేజీ నెట్‌వర్క్ పనులు, అదేవిధంగా రూ. 4 కోట్ల వ్యయంతో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మత రాజకీయాలకు చోటు లేదని, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎవరైనా చిచ్చు పెడుదామని ప్రయత్నిస్తే ఆలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని, ఇక మీదట అలాగే ఉంటామని పునరుద్ఘటించారు. హైదరాబాద్ వారసత్వ కట్టాలన్నింటిని పరిరక్షించుకుంటామని, మోజాం జాహి మార్కెట్‌ను అభివృద్ధి చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కులి కుతుబ్‌షా అర్బన్ డెవలప్‌ంట్‌కు పూర్వ వైభావన్ని తీసుకువస్తామని చారిత్రక సంపదైన సర్ధార్ మహల్‌ను అభివృద్ధ్దికి ప్రపంచ వారసత్వ దినోత్సవం మరసటి రోజే శ్రీకారం చుట్టామన్నారు.

అదేవిధంగా మిరాలం చెరువు వద్ద ఎస్‌టిపి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడంతో పాటు సెకండరీ కలెక్షన్ ట్రాన్స్‌పర్ స్టేషన్‌ను ప్రారంభించుకోవడం జరిగిందని వెల్లడించారు. కొన్ని మెట్రో నగరాల్లో మంచినీరు, విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతాయని కాని హైదరాబాద్ నగరంలో ఏలాంటి ఇబ్బందులు కాని కష్టాలు కాని లేవన్నారు. పాతబస్తీతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో నోటరీ భూముల సమస్య ఉందని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా కొందరూ పబ్బం గడుపుకుంటున్నారని, ఆలాంటి వారిని ఒక కంట కనిపెట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ గతంలో పాలించిన ప్రభుత్వాలు పాత బస్తీ అభివృద్ధిని పట్టించు కోలేదన్నారు. అదే తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా పాతబస్తీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పాతబస్తీ అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తున్న మంత్రి కెటిఆర్‌కు ధన్యవాదాలు అన్నారు. సర్ధార్ మహల్ బల్దియా కార్యాలయంగా సేవలందించిందని, దానిని రిస్తోరేషన్ పనులు చేపట్టడం సంతోషకరమన్నారు. బహదూర్‌పూర ఫ్ల్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తగ్గినున్నాయని తెలిపారు. అదేవిధంగా మీరాలం చెరువు నుండి చేపట్టనున్న బ్రిడ్జికు సంబంధించి సాంకేతిక అంశాలను చర్చిస్తున్నట్లు ఓవైసి వెల్లండించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, రియాజుద్దీన్ హసన్, ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, మహ్మద్ మోజాం ఖాన్, కౌసర్ మొయినుద్దీన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జలమండలి ఎండి దాన కిశోర్, నగర సిపి సి.వి.ఆనంద్, జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్ బి.సంతోష్. ఈఎన్‌సి జియాఉద్దీన్, సిఈ దేవానంద్, ఎస్‌ఇ దత్తుపంతు, సిసిపి దేవేందర్‌రెడ్డి, అడిషనల్ సిపి శ్రీనివాస్, జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News