Monday, April 29, 2024

కేంద్రం తప్పుడు విధానాల వల్ల సాగు చట్టుబండలు

- Advertisement -
- Advertisement -

CM KCR review on Vaanakalam crop policy

ఆరుగాలం కష్టించి పని చేస్తున్న దేశ రైతాంగాన్ని కేంద్రం నిరుత్సాహపరుస్తుంది

ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
కాళేశ్వరం ప్రాజెక్టును విస్తరింప చేస్తున్నాం, చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఏడాదిలో పూర్తి చేస్తాం

పంటల దిగుబడిని పెంచడానికి బదులు ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అవలంబించడం బాధకరం
తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొని వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది
వానా కాలానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి, ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవాలి
తెలంగాణకు కరువు అన్నదే రాదు
సరిపడా వానలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది
ఎరువుల అతి వాడకాన్ని మానుకోవాలి ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న భారతదేశంలో వ్యవసాయాభివృద్దికి పాటు పడాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కుదేలు చే సేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండ టం పట్ల సిఎం కెసిఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశా రు. ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న దేశ రైతాంగాన్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే చ ర్యలు చేపట్టడం ,దేశంలో పంటల దిగుబడిని పెంచేదిశగా కాకుండా ఉత్పత్తిని తగ్గించే విధం గా అపసవ్య విధానాలు అమలు చేస్తుండటం బాధాకరం అని సిఎం కేసిఆర్ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్య వసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. వానాకాలం మరికొద్ది నెలల్లో రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి అధికారులకు సిఎం సూ చించారు. పత్తి, మిర్చి, కంది, వాటర్ మిలన్ తదితర ప్రత్యామ్న్యాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధత పై ప్రగతి భవన్ లో మంగళవారం సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన వరి ధాన్యం సేకరణ పురోగతి పై అధికారులను సిఎం ఆరాతీశారు. లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు మరింత విస్తృతంగా క్రేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు నిరంతరం పంటపొలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలన్నారు. ఆ దిశగా అవగాహన పెంపొందించాలని,అందుకు ఏఈ అధికారులకు నిరంతరం శిక్షణా తరగతులను నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సిఎం సూచించారు. వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణ పై జాబ్ చార్ట్ తయారు చేయాలన్నారు.

పురోగమిస్తున్న తెలంగాణ వ్యవసాయం :

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. “తెలంగాణలో వ్యవసాయానికి వాతావరణం అనుకూలంగా ఉందని. సరిపడా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉండబోతున్నదన్నారు. రైతులు యాసంగి పనులను ముగించుకుంటున్నారని, వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానున్నదన్నారు. ఈలోపే అవసరమయ్యే ఎరువులు విత్తనాలు సరిపడా సమకూర్చుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి లోటు రాకుండా వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. కల్తీ విత్తనాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నేడు తెలంగాణ వ్యవసాయం గొప్పగా పురోగమిస్తున్నదని ప్రకటించారు.

ఉమ్మడి పాలనలో నాడు నామమాత్రంగా వున్న వ్యవసాయ రంగం, నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్ర జిఎస్డిపీకి 21 శాతం దోహదపడుతున్నదని , ఇంతటి ప్రగతి మామూలు విషయం కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయ రంగం కీలకంగా మారిందని వెల్లడించారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రానున్న ఏడాదిలో పూర్తవుతాయని సిఎం ప్రకటించారు.

తెలంగాణకు కరువన్నదే రాదు :

“భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయ రంగానికి ఇక కరువు అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగ వేగాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అందుకుంటూ ముందుకు సాగాల్సి వున్నది. వ్యవసాయ శాఖ నిరంతరం వైబ్రంట్ గా, బిజీ బిజీగా వుండాల్సి వున్నది..” అని వ్యవసాయ శాఖ మంత్రికి, అధికారులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు .వ్యవసాయ రంగం బలోపేతానికి, జిల్లా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను ( డిస్ట్రిక్ అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్) చేపట్టాలని సిఎం సూచించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లను, ఆర్డీవోలను కూడా కార్యాచరణ ప్రణాళికల్లో భాగస్వాములను చేయాలన్నారు.

ఎరువుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించాలి :

యూరియా వంటి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, శాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తూ, మోతాదుగా వాడేలా రైతులకు అవగాహన పెంచాలని సిఎం అధికారులకు సూచించారు. విపరీతమైన ఎరువులు, పురుగుమందుల వాడకం తో భూములు పాడవుతాయని హెచ్చరించారు. పంటలమార్పిడి చేయకుండా ఒకే పంటనే ఏండ్ల కొద్దీ వేయడం ద్వారా, నేల సహజ స్వభావం తగ్గి రోజు రోజుకూ భూసారాన్ని కోల్పోతున్నదని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. పంటల మార్పిడితో భూసారాన్ని పరిరక్షించుకోవడం తక్షణావసరమని సిఎం హెచ్చరించారు. ఈ దిశగా తగు ప్రణాళికలను సిద్దం చేసుకుని రైతులను చైతన్య పరచాలని మంత్రిని, అధికారులను సిఎం ఆదేశించారు.

అన్నం అంతా వొకేసారి తింటమా?

యూరియాను ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా పద్ధతిగా వినయోగించాలని సిఎం అన్నారు. ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాలను రైతులు తీసుకోవాలన్నారు. “ కొంతమంది రైతులు ఎరువులు ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతదని అనుకుంటరు. కానీ కాదు. ఏదైనా మోతాదుగా వాడుకోవాల్సిందే. మనం అన్నం తింటే వొకేసారి తింటమా? తినం కదా…ఎరువులు కూడా అంతే. పంటలు కూడా మానవ శరీరం లాంటివే. వాటికి ఆహారం ఎంతకావాల్నో అంతే తీసుకుంటాయి. మోతాదుకు మించి తిండి తింటే మనకు రోగాలు వచ్చినట్టు వరిపంటకు కూడా మోతాదు మించి ఎరువులు చల్లితే ఏపుగా ఎదగాల్సిన పంట ఆగమైతది..” అని సిఎం వివరించారు.

ఎకరానికి ఒక యూరియా బస్తాను ఒకేసారే వేయవద్దని, వరి పైరు పెరుగుతున్నకొద్దీ సమయానుకూలంగా మూడు నాలుగు సార్లు వినియోగించాలని సిఎం తెలిపారు. డిఎపి తదితర కాంప్లెక్సు ఎరువులను కూడా విపరీతంగా వాడకుండా, తగుపాళ్లలో వాడాలని రైతాంగానికి విజ్ణప్తి చేశారు. మారుతున్న కాలాన్ని బట్టి ఎరువులను ఎలా వాడాలో వ్యవసాయ అధికారులు రైతువేదికల ద్వారా రైతులను సమావేశ పరిచి అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని సిఎం సూచించారు. రానున్న వానాకాలం సీజన్ లో అందుబాటులో ఉంచాల్సిన డిఎపి, యూరియా తదితర ఎరువుల నిల్వలపై అధికారుల నుంచి సిఎం ఆరా తీసారు. యూరియా, డిఎపి తదితర ఎరువుల నిల్వలు చాలినంతగా వున్నాయని సిఎం కు అధికారులు నివేదిక అందించారు.

యుద్ధం నేపథ్యంలో పొదుపు :

డిఎపి తయారీలో వినియోగించే ముడిసరుకులు రష్యా, ఉక్రేయిన్ తదితర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ యుద్ధం జరుగుతున్నదని ఈ పరిస్థితుల్లో డిఎపి లభ్యత అవసరానికి మించి వుండబోదని అధికారులు ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తెచ్చారు. కాగా ఈ పరిస్థితుల్లో విచ్చలవిడిగా డిఎపి వాడకాన్ని తగ్గించి తగు మోతాదులో పొదుపుగా వాడుకోవాలనే విషయం పట్ల రైతులకు అవగాహన కల్పించాలని సిఎం అన్నారు. భూసారాన్ని పెంచే దిశగా కార్బన్ కంపోనెంట్ల వాడకాన్ని వినియోగించాలన్నారు. రాష్ట్రమంతటా ఈ సీజన్ నుంచే రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట వాడాకాన్ని పెంచాలన్నారు.

వరి పంటకు ప్రత్యామ్న్యాయం..పత్తికి పెరిగి డిమాండ్ :

వరిపంటను విపరీతంగా వేయడం ద్వారా భూసారం తగ్గిపోయే ప్రమాదం వుంటుందనే శాస్త్రీ య అధ్యయనాలను అధికారులు సిఎం కెసిఆర్ దృష్టికి తెచ్చారు. కాగా లాభదాయక పంటలను ఎంచుకుని పంటల మార్పిడి దిశగా రైతులను చైతన్య పరచాలని సిఎం అధికారులకు సూచించారు. కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లో చైనా తదితర దేశాల పత్తి దిగుబడి తగ్గిపోతున్న నేపథ్యంలో, తెలంగాణ పత్తికి డిమాండు పెరుగుతున్న అంశం పై సిఎం సమీక్షించారు. క్వింటాల్ పత్తికి 10 వేలనుంచి 13 వేలదాకా ధర పలుకుతున్న విషయాన్నిసమావేశంలో చర్చించించారు. రానున్న కాలంలో మరింతగా పత్తికి గిరాకీ పెరగనున్నదనే విషయాన్ని గుర్తించి, ఈ నేపథ్యంలో పత్తి పంట సాగును మరింతగా ప్రోత్సహించాలని సిఎం అధికారులను ఆదేశించారు. అదే సందర్భంలో మిర్చి కి కూడా ఊహించని రీతిలో క్వింటాల్ కు రూ.42 వేలకు పైగా ధర పలకడం గొప్ప విషయమని సిఎం అన్నారు. కంది కూడా మార్కెట్లో డిమాండు వున్న పంటేనని, కందిసాగు విషయంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వహించరాదన్నారు. సన్ ఫ్లవర్ పంట విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు.

వెదజల్లితే లాభం :

వరి సాగులో వెదజల్లుడు విధానాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా రైతుకు అన్ని విధాలుగా సాగు ఖర్చు తగ్గించవచ్చన్నారు. ఎరువుల వాడకం వెదజల్లడం తదితర వ్యవసాయ అంశాలకు సంబంధించి రైతులను చైతన్యపరిచే దిశగా డాక్యుమెంటరీలు తదితర ప్రచార కార్యక్రమాలను విస్త్రుతంగా చేపట్టాలని అధికారులకు సిఎం సూచించారు.

కల్తీ పై ఉక్కుపాదం :

కల్తీ విత్తన తయారీ దారులను వారి మూలాలను గుర్తించి కట్టడి చేయాలని సిఎం అన్నారు. అందుకోసం పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని వ్యవసాయ శాఖకు సిఎం సూచించారు. ఇప్పటినుంచే ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించాలన్నారు. నకిలీ, కల్లీ విత్తన విక్రయాలకు పాల్పడే వారిపట్ల , వాటిని సరఫరా చేసివారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు.

ధాన్యం సేకరణ పై సిఎం ఆరా :

రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన కార్యాచరణ ఏవిధంగా కొనసాగుతున్నదనే విషయాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ నుంచి సిఎం కెసిఆర్ ఆరా తీసారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ కార్యక్రమం పుంజుకున్నదనీ, గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితర అవసరాలను సమకూర్చుకున్నామని అనిల్ కుమార్ సిఎం కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6983 కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది లక్షం కాగా , ఇప్పటికే 536 కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 కేంద్రాల నుంచి ధాన్యం సేకరణ మొదలయ్యిందని ,ఇప్పటి వరకూ 1200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని కమిషనర్ సిఎం కు వివరించారు.

దళిత బంధును వేగవంతం చేయాలి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం కోసం ఎంపికైనవారిలో అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం ప్రయో జనాలు మరింత వేగంగా అందేలా చేరేలా చర్యలు చేపట్టాలని సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రోజుకు 400 వందల మంది చొప్పున ఇప్పటి వరకు 25,000 మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందించామని సిఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా సిఎం కెసిఆర్ కు నివేదిక అందిచారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. “ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే దళితబంధు కోసం నిధులను విడుదల చేసింది.ఈ నేపథ్యంలో గుర్తించిన అర్హులకు నిధులను అందించడంలో జాప్యం జరగరాదు”..అని సిఎం స్పష్టం చేశారు. దళితబంధు పథకాన్ని మరింత ప్రభావవంతంగా, వేగవంతంగా అమలు చేసేందుకు గాను త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సిఎం తెలిపారు.“ దళితబంధు పథకం అమలవుతున్న విధానం పట్ల దేశం నలుమూలలనుంచి ప్రశంసలు అందుకుంటున్నాం.. ఈ పథకం అమలు ద్వారా మనం అనుకున్నదానికంటే ఎక్కువగా ఫలితాలు అందుతాయి..

దళితబంధు కోసం చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి తిరిగి లాభాలను ఆర్జించి పెడుతాయి.. సామాజిక పెట్టుబడిగా మారి, వ్యవసాయ రంగానికంటే గొప్పగా స్పిల్ ఎకానమీకి దోహదపడుతుంది. దళితబంధు పెట్టుబడి ద్వారా జరిగే వ్యాపార వాణిజ్యాలు తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జిఎస్డిపీని పెంచడంలో దోహదపడుతుంది..” అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు .ఇప్పటికే దళితబంధు కింద అందిన ఆర్థిక సాయం ద్వారా వ్యాపార, వృత్తి రంగాల్లో దళితులు సాధిస్తున్న విజయాలే అందుకు తార్కాణం అని సిఎం పేర్కొన్నారు. “ ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలి. తద్వారా దళిత యువతలో వున్న నిరాశానిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుంది. వారు వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది” అని సిఎం వెల్లడించారు. దవాఖానాలు ఫెర్టిలైజర్ షాపుల వంటి ప్రభుత్వం లైసెన్స్ అమలు పరుస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వారికి అవకాశాలు కల్పించాలని సిఎం కేసిఆర్ పునరుధ్ఘాటించారు.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు భూపాల్ రెడ్డి, రాహుల్ బొజ్జా, స్మితా సభర్వాల్, వి.శేషాద్రి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ అడిషనల్ డైరక్టర్ కె.విజయ కుమార్, జాయింట్ డైరక్టర్ కె.రాములు, అసిస్టెంట్ డైరక్టర్ మాధవి,వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News