Friday, May 3, 2024

నిఫా నివారణకు టీకా లేదు.. కట్టడి చేయడమే ఏకైక మార్గం

- Advertisement -
- Advertisement -

There is no vaccine to prevent NIPAH virus

కొజికోడ్ : కేరళలో ఒకవైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్ భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ రెండు వైరస్‌లు గబ్బిలాల నుంచి వచ్చినవే అయినా వీటి లక్షణాలు, రోగి ఆరోగ్యసమస్యలు భిన్నంగా ఉంటాయి. కరోనా కన్నా అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్ నివారణకు ఇప్పటివరకు సరైన ఔషధం కానీ టీకా కానీ లేక పోవడం విశేషం. ప్రపంచ ఆరోగ్యసంస్థ టీకా తయారీ ప్రాధాన్యాల బ్లూప్రింట్‌లో నిఫా వైరస్ కూడా ఉన్నా దీని వ్యాప్తి కేవలం స్థానికంగా పరిమితం కావడంతో దీని టీకాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. నిఫా వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. దీనిని జునోటిక్ వ్యాధి అంటారు. 1999 లో మొదటిసారి మలేసియాలో దీని ఉనికి బయటపడింది. మలేసియాలోని సున్‌గాయ్ నిఫా గ్రామం పేరు దీనికి పెట్టారు. నిఫా వైరస్ ఆతిధ్య జీవుల జాబితాలో పందులు,ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎలాంటి ప్రభావం చూపించలేవు. నిఫావైరస్‌కు వైద్యం లేదు. ఇప్పటివరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటు లోకి రాలేదు.

రోగిని వేరుగా ఉంచుతున్నారు. తగినంత నీరు అందిస్తున్నారు. దీంతోపాటు రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స విధానం వినియోగించడంపై పరిశీలిస్తున్నారు. నిఫాపై అనేక యాంటీవైరల్ డ్రగ్స్‌ను సిఈపిఐ ప్రయోగించగా అవి జంతువుల్లో మాత్రమే సత్ఫలితాలు చూపించాయి. కొవిడ్‌తో పోలిస్తే నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. అయితే ఇది అంత వేగంగా వ్యాపించక పోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. గ్లోబల్ వైరస్ నెట్‌వర్క్ ప్రకారం నిఫా వైరస్ ఆర్‌నాట్ 0.43. అంటే 100 మంది నిఫా వైరస్ బాధితుల నుంచి కేవలం మరో 43 మందికి వ్యాధి వ్యాపిస్తుందన్న మాట. కాని వ్యాధి సోకిన వారిలో 45 శాతం నుంనచి 70 శాతం మంది మరణిస్తున్నారు.

కేరళలో 19 మందికి వైరస్ సోకితే 17 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఆర్‌నాట్ తరచూ 1 కి పైగా నమోదవుతోంది. అంటే నిఫాతో పోలిస్తే ఇది వేగంగా వ్యాపిస్తోందన్న మాట. చాలా మంది స్వల్ప లక్షణాలతో బయటపడుతున్నారు. మరణాల రేటు కూడా 1 శాతం కంటే తక్కువగా ఉంటోంది. ఇప్పటికే ఇది మలేసియా, భారత్, సింగపూర్, బంగ్లాదేశ్‌ల్లో మనుషులకు సోకింది. ఇదే సమయంలో కాంబోడియా, ఇండోనేసియా, మడగాస్కర్, థాయ్‌లాండ్, తిమోర్ వంటి దేశాల్లోని గబ్బిలాల్లో ఈ వైరస్ జాడ బయటపడింది. భారత్ లోని సిలుగురిలో 2001 జనవరిఫిబ్రవరి మధ్య 66 నిఫా కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన ప్రతి నలుగురిలో ముగ్గురు మరణించారు.

నిఫా లక్షణాలు

నిఫా వైరస్ లో రోగి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకుండా అసిమ్టమాటిక్‌గా ఉంటుంది. మరికొందరిలో మాత్రం తీవ్ర శ్వాస ఇబ్బందులు మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మొదట .జ్వరం తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురు పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ తరువాత రోగి పరధ్యానంగా ఉండడం, మత్తుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు దెబ్బతినడం, వణికిపోవడం, నిమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా రోగి 24 గంటల నుంచి 48 గంటల్లో కోమా లోకి చేరుకుంటారు. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్ ఉంటుంది.

వ్యాధి నిర్ధారణ …

నిఫా వైరస్‌ను గుర్తించడానికి ఆర్టీపీసిఆర్ పరీక్షను నిర్వహిస్తారు. దీంతోపాటు పాలిమరైజ్ చైన్ రీయాక్షన్ పరీక్షలో కూడా కచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ఈ పరీక్షలో అత్యంత సున్నితమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంది. పీసీఆర్ పరీక్షకు ప్రాధాన్యం ఇస్తారు.

కాంట్రాక్ట్ ట్రేసింగ్

నిఫా వైరస్ విషయంలో కూడా కరోనా మాదిరి కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, ఐసోలేషన్ వంటి చర్యలు తీసుకుంటారు. 2018 లో కేరళ ప్రభుత్వం సమర్ధంగా నిఫా వైరస్‌ను అరికట్టిన తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News