62.595 కిలోల గంజాయి స్వాధీనం
వేటాడి పట్టుకున్న బాలానగర్ ఎస్ఓటి పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయిని రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను బాలానగర్, మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.62.595 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… మహారాష్ట్రలోని అకోలా జిల్లా, హెవర్ఖేడ్ తానా, తెల్లారా తాలూకా, బోర్వా గ్రామానికి చెందిన పెంట్యా చౌహాన్, కరణ్ నానా జాదవ్, దేవకి చౌహాన్, ఇందు మోతీ, ఉషా చౌహాన్, ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన పంగి మల్లేష్ కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు. ఇందులో పెంట్య చౌహాన్, ఉషా చౌహాన్, పంగి మల్లేష్ పరారీలో ఉన్నారు. పెంట్య చౌహాన్ గంజాయి రవాణా చేస్తున్నాడు. మిగతా వారికి గంజాయిని ఎపిలోని విశాఖ నుంచి అకోలాకు రవాణా చేసినందుకు ఒకరికి రూ.5,000 చొప్పున ఇస్తున్నాడు. ఈ విషయం వారికి ముందుగానే చెప్పి తీసుకుని వచ్చాడు.
ఎపిలోని విశాఖలో మల్లేష్ వద్ద గంజాయిని కొనుగోలు చేసిన నిందితులు 30 బ్యాగుల్లో విడిదీసుకున్నారు. అక్కడి నుంచి ఇంటి వస్తువులు విక్రయిస్తున్నట్లు వాటి మధ్యలో గంజాయిని పెట్టుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. దీనిలో భాగంగా నిందితులు విడిపోయి అన్నవరం నుంచి డిసిఎంలు, లారీల్లో గంజాయి తరలిస్తు పటాన్చెరువు హైవేకి వచ్చారు. పంగి మల్లేష్, ఉషా చౌహాన్ పటాన్చెరువు వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించగా అక్కడి నుంచి పారిపోయారు. మేడ్చల్కు గంజాయితో వచ్చిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ డిసిపి పద్మజా, ఎస్ఓటి డిసిపి సందీప్ పర్యవేక్షణలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ ఇన్స్స్పెక్టర్ జేమ్స్ బాబు, ఎస్సైలు తదితరులు పట్టుకున్నారు.