న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ముూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడ్డారు. ఆగ్రా జిల్లాలోని ఫతేహాబాద్ ప్రాంతంలో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై బస్సు ట్రక్కును ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, దాదాపు 15 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుండి బీహార్కు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటన బులంద్షహర్ జిల్లాలో జరిగింది. వివాహం నుండి తిరిగి వస్తున్న ఐదుగురు కారు బోల్తా పడి మంటల్లో చిక్కుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. జహంగీరాబాద్-బులంద్షహర్ రహదారిపై జానిపూర్ గ్రామం సమీపంలో బాధితుల వాహనం వంతెనను ఢీకొట్టి, బోల్తా పడటంతో మంటలు చెలరేగాయని.. మంటల్లో చిక్కుకుని ఐదుగురు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని బులంద్షహర్ గ్రామీణ ఎస్పీ తేజ్వీర్ సింగ్ చెప్పారు. బుదౌన్లో జరిగిన ఓ వివాహానికి హాజరైన తర్వాత ఢిల్లీలోని మాల్వియా నగర్కు తిరిగి వెళుతున్న క్రమంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఆగ్రాలో జరిగిన మరో విషాద సంఘటనలో పికప్ వాహనం బ్యాలెన్స్ కోల్పోయి సహద్ర ఫ్లైఓవర్ పై నుండి పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.