కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని శుక్రవారం నాడు ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల- నుంచి గుంటూరు వెళ్లే రైల్వే మార్గంలోని చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న చలమ రేంజ్ అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి చనిపోయినట్లు పేర్కొంటున్నారు. పులి కలేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు కూడా పలు ప్రాంతాల్లో వాహనాలు ఢీకొని అటవీ జంతువులు మరణించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కరకగూడెంలో పులి సంచారం
తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. తాడ్వాయి అటవీ ప్రాంతం నుంచి కరకగూడెం అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించినట్లు అటవీ అధికారులు తెలిపారు. రఘునాదపాలెం అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు పశువులను మేపుతుండగా పెద్దపులి వారి కంట పడటంతో అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను పరిశీలించారు. ఆ పాదముద్రల ఆధారంగా పులి సంచారాన్ని నిర్ధారించారు. ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.