కొత్త రెవెన్యూ చట్టంపై సమాలోచనలు
కలెక్టర్లకు దిశానిర్దేశం
పథకాల అమలుపై నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వ శాఖలు
హైదరాబాద్: జిల్లాల్లో పాలనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం కలెక్టర్ల సదస్సులో దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు ప్రతిష్టాత్మక పథకాల అమలుపై ప్రగతి నోట్ను తయారుచేసుకున్నాయి. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ఇటీవలె జిల్లాలకు కొత్త కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసినందున ప్రభుత్వ ఉద్దేశ్యాలను సిఎం తెలియజేయనున్నారు. అందులో భాగంగా త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నూతన రెవిన్యూ చట్టం ముసాయిదాపై వివరించనున్నారు. రెవిన్యూ చట్టం ముసాయిదాలో ప్రభుత్వం పొందుపర్చాలనుకుంటున్న అంశాలను వివరించడంతో పాటు కలెక్టర్ల నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకోనున్నారు.
అలాగే ఇప్పటికే పూర్తయి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలుతో పురోగతిపై చర్చించడంతో పాటు భవిష్యత్లో మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే దానిపై వివరించనున్నారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుదనే దానిపై కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు తెలిసింది. ఇక రైతు సమన్వయ సమితులను ఎలా బలోపేతం చేయాలనే దానిపై కూడా సిఎం స్పష్టతనివ్వనున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ సమస్యతో వచ్చిన వెంటనే పరిష్కరించాలని తెలియజేయనున్నారు. త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్, కేంద్రం నుంచి నిధులు వంటి వాటిపై వివరించనున్నట్లు తెలిసింది.