కట్టా శేఖర్రెడ్డి, మైడ నారాయణ రెడ్డి, గుగులోతు శంకర్నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, అమీర్ హుస్సేన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఐదుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కట్టా శేఖర్ రెడ్డి, మైడ నారాయణ రెడ్డి, గుగులోతు శంకర్నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, డాక్టర్ ఎం.డి అమీర్ ఆలియాస్ అమీర్ హుస్సేన్ను నియమించింది. ఈ ఐదుగురు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల వరకు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు సమాచార కమిషనర్గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో సోమేష్ కుమార్ స్పష్టం చేశారు.
కట్టా శేఖర్ రెడ్డి
కట్టా శేఖర్ రెడ్డికి మీడియా రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 1961లో డిసెంబర్ ఐదో తేదీన జన్మించారు. ఎం.ఎ, ఎంఫిల్ చేశారు. ప్రధాన ప్రతికలలో ఉన్నత హోదాల్లో పనిచేశారు. ఉదయంలో 1987లో తిరుపతిలో సబ్ ఎడిటర్గా ఉద్యోగ ప్రయాణం మొదలు పెట్టిన శేఖర్ రెడ్డి అక్కడే డెస్క్ ఇంఛార్జీగా 1988 వరకు పనిచేశారు. ఇక 1989 జనవరిలో ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్గా, ఆ తరువాత కొంతకాలం రెడిఫ్.కామ్లో సీనియర్ సబ్ ఎడిటర్గా, ఆ తరువాత వార్తాలో సీనియర్ సబ్ ఎడిటర్గా, సెర్ప్ మీడియా ఎగ్జిక్యూటివ్గా చేశారు.
ఆగస్టు 2002 నుంచి ఆగస్టు 2008 వరకు ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఎడిటర్గా, ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్గా చేశారు. ఆ తరువాత మహా న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా చేశారు. తెలంగాణ ప్రైవేట్ లిమిటెడ్ (నమస్తే తెలంగాణ) సిఇఒగా 2010 నుంచి 2014 వరకు చేశారు. నమస్తే తెలంగాణ ఎడిటర్గా జూలై 2014 నుంచి పనిచేస్తున్నారు. పలు రచనలు కూడా చేశారు.
మైడ నారాయణరెడ్డి
వ్యవసాయ కుటుంబానికి చెందిన మైడ నారాయణరెడ్డి ముభారస్పూర్ గ్రామం దౌలతాబాద్ మండలం సిద్దిపేట జిల్లాలో జన్మించారు. 1995 సంవత్సరం నుంచి వార్త పత్రికలో ట్రైనీ సబ్ ఎడిటర్గా తన జర్నలిజం జీవితాన్ని ప్రారంభించారు. 2003లో ఆంధ్రజ్యోతి పత్రికలో చేరిన నారాయణరెడ్డి రాజకీయ వార్తలు, సెక్రటరీయేట్, అసెంబ్లీ, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్కు సంబంధించిన వార్తలు చీఫ్ రిపోర్టర్గా చూసుకునేవారు. 2007-2008 సంవత్సరంలో సాక్షి మీడియాలో ఛీప్ రిపోర్టర్గా పనిచేశారు. 2008లో హెచ్ఎంటివి బ్యూరో ఇన్ఛార్జ్గా పనిచేశారు. 2009 నుంచి టి న్యూస్ ఎడిటర్, సిఇఒగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ప్రెస్ అకాడమీ కమిటీ మెంటర్గా విధులు నిర్వహించారు.
గుగులోతు శంకర్ నాయక్
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువ కెరటం గుగులోతు శంకర్ నాయక్. మారుమూల గిరిజన తండా నుంచి తెలంగాణ విద్యార్థి జెఎసి, ఓయూ జెఎసి రాష్ట్ర అధ్యక్షుడిగా వరకు అంచెలంచెలుగా ఎదిగారు. ఉన్నత చదువులు, ఓయూ నుంచి డాక్టరేట్ కూడా పొందారు. మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ నియోజకవర్గం ,మరిపెడ మండలం,బావాజీ గూడం గ్రామం, భోజ్య తండాకు చెందిన భాగ్య నాయక్ సాలమ్మ దంపతులకు మూడో సంతానం శంకర్ నాయక్. చిన్నప్పటి నుంచి ప్రభుత్వం విద్యాసంస్థలలొనే చదువుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎ పూర్తి చేశాడు. ఇక్కడ స్టూడెంట్స్ హాస్టల్ ఎన్నికల పోటీలో ఛైర్మెన్గా కూడా ఎన్నికయ్యారు.
సయ్యద్ ఖలీలుల్లా
హైదరాబాద్కు చెందిన సయ్యద్ ఖలీలుల్లా 1961లో నగరంలోని ఆఘాపూర్లో జన్మించారు. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి 1990 సంవత్సరంలో లా పట్టభద్రులైన ఖలీలుల్లా న్యాయవాదిగా, సిటీ క్రిమినల్ కోర్టులో లైఫ్టైమ్ మెంబర్గా, ఓవర్సీస్ మ్యాన్పవర్ రిక్రూటింగ్ ఏజెంట్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్గా విధులు నిర్వహిస్తున్నారు.
డాక్టర్ ఎం.డి అమీర్
హైదరాబాద్ నగరం మసాబ్ ట్యాంక్, శాంతినగర్కు చెందిన డాక్టర్ ఎం.డి అమీర్ 1969లో జన్మించారు. పిల్లల హక్కులు, చైల్డ్ లేబర్, పేద విడాకులు పొందిన మహిళల తరపున ఎన్జిఒలతో కలిసి చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాది అయిన ఆయన న్యాయ అవగాహన కార్యక్రమాలు, ఫ్రీ మెడికల్ క్యాంపులు, బ్లెడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించారు.