Thursday, May 16, 2024

రూ.25వేల వరకు వన్‌టైమ్ రుణమాఫీ!

- Advertisement -
- Advertisement -

Loan Waiver

 

నిధులు సమకూరితే రూ.50వేల వరకు ఒకేసారి
ఎస్‌ఎల్‌బిసి నివేదికపై ప్రభుత్వం యోచన

హైదరాబాద్: లక్షల రూపాయల లోపు పంట రుణాల్లో కొంత మొత్తాన్ని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ మొత్తంలో పంట రుణం తీసుకున్న చిన్న, సన్నకారు రైతుల్లో ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కేటాగిరీల వారీగా రుణమాఫికి సంబంధించిన నివేదికన బ్యాంకులు ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖలకు పంపాయి. ఇందులో రూ.25 వేల వరకు ఉన్న రుణాలు, ఆ తరువాత రూ.25 వేల రూ.50 వేల వరకు, రూ.50 వేల నుంచి రూ.75 వేలు, రూ.75 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు ఎంత మొత్తంలో రుణాలు తీసుకున్నారని విభజించారు. రూ. ఒక లక్ష పైన రుణం ఉన్నప్పటికీ, లక్ష రూపాయల వరకు వారికి మాఫీ చేయనున్నారు.

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రభుత్వానికి రుణమాఫీ లెక్కలను సమర్పించింది. డిసెంబర్ 11వ తేదీ 2018 వరకు ఉన్న లక్ష రూపాయాల పంట రుణాలను మాఫీ చేయనున్నారు. రూ.25 వేల వరకు పంట రుణాలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద మాఫీ చేస్తే రూ.1197 కోట్లు అవుతుంది. ఒకవేళ రూ.50 వేల వరకు మాఫీ చేస్తూ రూ.4302 కోట్లు అవుతుంది. ఒకవేళ రూ.25 వేల వరకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసినా, రూ.50 వేల రెండు సెటిల్‌మెంట్లలో పూర్తి చేయాలని, మిగతా వారికి మూడు లేదా నాలుగు విడతల్లో మాఫీ చేయాలని భావిస్తోంది. గత రుణమాఫీ మాదిరి రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు ఒక అధికారి మన తెలంగాణకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు రుణమాఫీకి కేటాయించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.7 వేల కోట్లు లేదా ప్రస్తుతం కేటాయించిన మొత్తమే అంచనాల్లో చూపనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.

మాఫీపై ఎస్‌ఎల్‌బిసి లెక్క
ఎస్‌ఎల్‌బిసి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం రూ.25 వేల వరకు పంట రుణాలు రూ.1197 కోట్లు 5.83 లక్షల మంది రైతులు తీసుకున్నారు. అలాగే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రూ.3104 కోట్లు 8.14 లక్షల మంది పంట రుణాలు పొందారు. అలాగే రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు రూ.5061 కోట్లు 8.81 లక్షల మంది రైతులు తీసుకున్నారు. రూ.75 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు 7.09 లక్షల మంది రైతులు రూ.5776 కోట్లు పంట రుణాలు తీసుకున్నారు. ఇక రూ. ఒక లక్షకు పైగా రుణం తీసుకున్నప్పటికీ వారికి రూ. ఒక లక్ష లోపు మాఫీ చేస్తే రూ.10,795 కోట్లు అవుతుంది. ఇందులో 10.79 లక్షల మంది రైతులు ఉన్నారు. మొత్తంగా 40.83 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా మారనున్నారు.

అయితే ఇందులో రెండు బ్యాంకులలో పంట రుణం పొందిన వారు, కుటుంబంలో ఒక్కరికే అర్హత కల్పిస్తే ఈ సంఖ్య కొంత తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2014లో రుణమాఫీ చేసినపుడు అనుసరించిన విధానాలే 90 శాతం వరకు ఇప్పుడు అమలు చేయనున్నారు. నిబంధనలు ఈ రకంగా ఉండనున్నాయి. రైతులు తీసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని లక్ష రూపాయలకు మించకుండా డిసెంబర్ 11, 2018 కటాఫ్ తేదీతో అర్హులైన వారందరికీ పంట రుణ మాఫీ వర్తింపజేస్తారు. కుటుంబం అంటే భార్య, భర్త వారి మీద ఆధారపడి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం రేషన్ కార్డు వివరాలను ఆధారం చేసుకుంటారు. ఎఇఒ, విఆర్‌ఒ, పంచాయతీ సెక్రటరీల సాయం తీసుకుంటారు. స్వల్పకాలిక పంట రుణాలు 12 నెలల చెల్లింపు కాల వ్యవధి ఉన్న వాటికే మాఫీ వర్తిస్తుంది, ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్పకాల రుణాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

పంట రుణం                                      రైతులు(లక్షల్లో)                           మొత్తం (రూపాయాల్లో)

రూ.25 వేల లోపు                               5.83                                         1197 కోట్లు
రూ.25 వేల నుంచి రూ.50 వేలు               8.14                                          3104 కోట్లు
రూ.50 వేల నుంచి రూ.75 వేలు               8.81                                          5061 కోట్లు
రూ.75 వేల నుంచి రూ.ఒక లక్ష                7.09                                           5776 కోట్లు
రూ.లక్ష పైన తీసుకున్నా ఒక లక్ష              10.79                                         10,795 కోట్ల
రూపాయాల వరకు మాఫీ చేస్తే

Loan Waiver One Time Settlement
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News