మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్ఎస్ బలపర్చినవారే
హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవి కాకుండా ఇతర ప్యాక్స్లలో మరో 3224 డైరెక్టర్ పోస్టులు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సోమవారం రాత్రి ప్రకటించింది. మొత్తం మొత్తం 904 ప్యాక్స్లలోని 11,653 డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 34,109 నామినేషన్లు వచ్చాయి. ఇందులో సోమవారం 13,925 మంది అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు, ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది.
5849 డైరెక్టర్ పోస్టులకు 13,642 మంది పోటీ పడుతున్నారు. వీటికి ఈ నెల 15 ఎన్నిక నిర్వహించనున్నారు. అత్యధికంగా ఖమ్మంలో 34 ప్యాక్స్లు, తరువాత నిజామాబాద్లో 26,ఆదిలాబాద్లో 11,మంచిర్యాల్లో 6, ఆసిఫాబాద్లో మూడు, జగిత్యాల్లో ఐదు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లలో మూడు చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్లో రెండు చొప్పున మెదక్లో ఐదు, సూర్యాపేటలో పది, కామారెడ్డిలో 12,వికారాబాద్లో మూడు, వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్, జనగాం, జయశంకర్ భూపాలపల్లిలలో రెండు చొప్పున, మహూబాబాద్లో మూడు ఏకగ్రీవమయ్యాయి.
టిఆర్ఎస్ బలపర్చినవారి హవా..
ఏకగ్రీవం అయిన వాటిలో దాదాసే టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే ఉన్నారు. దీంతో ప్యాక్స్ల ఛైర్మెన్ పోస్టులు కూడా టిఆర్ఎస్ మద్ధతుదారులకే దక్కనున్నాయి. పలు జిల్లాల్లోని ప్యాక్స్ల్లో డైరెక్టర్ పదవులకు టిఆర్ఎస్ పార్టీ మద్ధతు తెలిపి బలపర్చిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో 25 ప్యాక్స్లకు గాను 18 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో 20 ప్యాక్స్లకు గాను 19 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి.మంచిర్యాల జిల్లా కోటపల్లి సహకార సంఘం ఎన్నికల్లో టిఆర్ఎస్ బలపర్చిన 12 మంది అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో, ఛైర్మన్ పదవి సొంతం చేసుకుంది.
చెన్నూరులో ఫలించిన ఎంఎల్ఎ బాల్క వ్యూహం
చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో టిఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని సంఘాలను కైవసం చేసుకోవడంలో సఫలమయ్యారు. చెన్నూరు సొసైటీకి 13 డైరెక్టర్లకు గానూ 12 డైరెక్టర్లు ఏకగ్రీవం. మందమర్రి సొసైటీకి 13కు గాను 13 ఏకగ్రీవం. జైపూర్ సొసైటీకి 13కు గాను 12 ఏకగ్రీవం. కోటపల్లి సొసైటీకి 13 కు గాను 12 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజేతలకు ఎంఎల్ఎ బాల్కసుమన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నెల 15న ఎన్నికలు జరిగే చెన్నూరు పరిధిలోని మిగిలిన స్థానాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే గెలుస్తారని ధీమాను ఆయన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల రైతుల్లో ఉన్న అచంచల విశ్వాసానికి సహాకార ఎన్నికలు ఏకగ్రీవ ఫలితాలే నిదర్శనమని సుమన్ పేర్కొన్నారు.