హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 19న పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు వయసున్న 38,36,505 మంది పిల్లలకు చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశామని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే 50,64,500 లక్షల పల్స్ పోలియో డోసులను అన్ని జిల్లాలకు పంపించామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23,231 బూతులు, అన్ని హాస్పిటళ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లలోనూ క్యాంపులు పెట్టి చుక్కల మందు వేయనున్నారు. బస్తీలు, ఇటుక బట్టీల్లో పనిచేసే వారి పిల్లలు, సంచార జాతుల వారి పిల్లలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లల తదితరుల కోసం వారి నివాస ప్రాంతాలకే వెళ్లి డ్రాప్స్ వేసేందుకు సుమారు 830 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ఇమ్యునైజేషన్ ఇంచార్జ్, డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లలందరికీ డ్రాప్స్ వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.