Sunday, June 22, 2025

గిరిజన మహిళలపై అటవీ అధికారుల దాడి రాక్షసచర్య: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

భద్రాచలం -కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామంలో గిరిజన మహిళలపై అటవీ అధికారులు చేసిన అమానుషమైన దాడిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. గిరిజన మహిళల చీరలను చింపి, నిర్దాక్షిణ్యంగా కొట్టడం క్రూరత్వం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార మదం, అహంకారంతో రేవంత్ ప్రభుత్వం చేసిన రాక్షసచర్య అని మండిపడ్డారు. తనను ప్రశ్నించే మహిళలను వివస్త్రను చేస్తానని అసెంబ్లీలో బహిరంగంగా రేవంత్ రెడ్డే ప్రకటించినప్పుడు, ఆయన ప్రైవేటు సైన్యం లాగా పనిచేస్తున్న అధికారులు కూడా అలానే ప్రవర్తిస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఈ అనాగరిక చర్య తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవంపై ప్రత్యక్ష దాడి అని ఒక ప్రకటనలో పేర్కొనారు. 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూముల నుంచి అడవి బిడ్డలను వెళ్లగొట్టాలనుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి పాతరవేయడమేనని విరుచుకుపడ్డారు.

తమ నోటికాడి బువ్వ గుంజుకోవద్దని ప్రాథేయపడిన నిస్సహాయ స్త్రీలపై దాడి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నైతిక పతనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రశ్నించేవారిపై బుల్డోజర్లను పంపి రేవంత్ రెడ్డి పాలిస్తున్నారని, తన గుర్తును హస్తం నుంచి బల్డోజర్‌కు మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. రాహుల్ గాంధీ వాగ్ధానం చేస్తున్న న్యాయం, సమానత్వం అంటే బుల్డోజర్ సంస్కృతేనా..? అని ప్రశ్నించారు. మానవీయ విలువలకు ఘోరి కట్టిన ఈ అవమానకర సంఘటనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. తమ భూముల్ని కాపాడుకోవాలనుకున్న గిరిజన మహిళలపై నిర్దాక్షిణ్యంగా సాగిన ప్రభుత్వ దమనకాండ సిఎం రేవంత్ రెడ్డి హింసాత్మక మనస్తత్వానికి ప్రతిబింబం అని విమర్శించారు.ఒక గుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే, ప్రజాస్వామ్యం నిరంకుశత్వంగానే మారుతుందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు దాడికి పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఎస్‌సి/ఎస్‌టి అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ అన్నారు. ఇరవైండి గిరిజనులకు అండగా బిఆర్‌ఎస్ ఉంటుందని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News