మధ్యప్రదేశ్లో కరోనా వేళ కలకలం
భోపాల్ : మధ్యప్రదేశ్లో రోడ్డు పక్కన ఓ ట్రక్కు వదిలేసి వెళ్లారు. ఈ ట్రక్కులో 2 లక్షల కరోనా టీకాలు ఉండటం సంచలనం కల్గించింది. అన్ని రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్లోనూ కరోనా కలకలం రేపుతోంది. దీనితో అందరికి ఇప్పుడు కరోనా టీకా అత్యవసరం అయింది. ఈ దశలో రెండు లక్షల కరోనా టీకాలతో ట్రక్కు ఎవరో వదిలిపెట్టి వెళ్లడంతో స్థానిక అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలోని నర్సింగ్పూర్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు కరేలీ ప్రాంతంలో బస్టాండ్కు సమీపంలోని ట్రక్కు చాలా సేపు ఆగి ఉంది. దీనితో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీనితో వారు అక్కడికి వచ్చి ట్రక్కును తెరిచి చూసి కంగుతిన్నారు.
ఇందులో దాదాపు 2,40,000 కొవాగ్జిన్టీకాలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడా డ్రైవర్, క్లీనర్ కనబడలేదు. ట్రక్కుపై ఉన్న నంబర్ సాయంతో ట్రక్కు ఎవరిది అనేది తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. లోపల ఉన్న ఎయిర్ కండిషన్ బాగా పనిచేస్తూ ఉండటం , డోసులు అన్ని భద్రంగా చెడిపోకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ విలువ దాదాపు రూ 8 కోట్లు వరకూ ఉంటుందని అంచనా వేశారు. ట్రక్కు ఇప్పుడు పోలీసుల స్వాధీనంలో ఉంది. డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నారు.