Sunday, April 28, 2024

సనాతన ధర్మంతో అసమానతల అంటువ్యాధి..

- Advertisement -
- Advertisement -

చెన్నై : సనాతన ధర్మం దేశానికి పట్టిన పీడ, చీడ చివరికి వదలని కొవిడ్ వంటిదని తమిళనాడు సిఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వూ ఇస్తూ సనాతన ధర్మంతో సామాజిక న్యాయం జరగదని, ఇది మలేరియా, డెంగ్యూ వంటిదని స్పందించారు. దీనిని అంతా వ్యతిరేకించాలి. కూకటివేళ్లతో పెకిలించాలని వ్యాఖ్యానించారు. డిఎంకె యువజన నేత, ఇటీవలే మంత్రి కూడా అయిన దయానిధి స్టాలిన్ శనివారం రాత్రి చెన్నైలో జరిగిన రచయితల సదస్సులో ప్రసంగించారు. ఈ దశలో ఆయన దేశంలో పాతుకుపోయిన సనాతన ధర్మం విషయం ప్రస్తావించారు. ఇది మనకు వారసత్వపు తిరోగమన వాదాన్ని తెచ్చిపెడుతోంది. ప్రజలను మతాలు, కులాలు, చివరికి లింగ వ్యత్యాసాలతో విభజిస్తోందని తెలిపారు.

అన్నింటికి మించి ఈ రుగ్మతతో సమానత, సామాజిక న్యాయం తలెత్తలేకపోతోందని విమర్శించారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిని ఊచకోతకు గురి చేయాలని తాను పిలుపు నివ్వడం లేదని, ఈ విధంగా తాను చెప్పినట్లు ప్రచారం చేయడం అనుచితం అన్నారు. అయితే విభజన రేఖలను సృష్టిస్తోన్న ప్రక్రియను తొలిగించడం వల్ల సమాజానికి దేశానికి , మానవతకు మంచి జరుగుతుందని, అంతా కోరుకునే సమానత వెల్లివిరుస్తుందని తెలిపారు. తాను సనాతన ధర్మంతో దెబ్బతింటున్న అణగారిన వర్గాల తరఫున తన వాదన విన్పిస్తున్నానని సిఎం కుమారుడు తమ ఫక్కా ద్రావిడ వాదన విన్పించారు. దెబ్బతిన్న వారి కోసం సనాతన ధర్మం నిర్మూలించుకుని తీరాలనే తన ప్రతి మాటకు కట్టుబడి ఉంటున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం గురించి విస్తృత అధ్యయనం చేసిన పెరియార్, అంబేద్కర్‌ల రచనల గురించి తాను మరింత విస్తృతంగా ప్రచారం చేయదల్చుకున్నానని తెలిపారు.

ఏ రూపంలో అయినా సనాతన ధర్మంతో సమాజానికి హాని జరిగితే దానిని సహించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. దోమలు కీటకాలతో పలురకాల రోగాలు వ్యాపిస్తాయి. ఇక సనాతన ధర్మపు సూత్రాలతో అంతకంటే బాధాకరమైన అవలక్షణాలు నెలకొంటాయని, వీటిని బడుగు వర్గాలు తరాలుగా అనుభవిస్తున్నారని విమర్శించారు. పలు సామాజిక రుగ్మతలకు ఈ సనాతన ధర్మం పాటింపు కారణం అని తాను ప్రత్యేకంగా చాటింపు చేయాల్సిన అవసరం లేదన్నారు. సంస్కృత పదం సనాతనం అంటేనే శాశ్వతం , మార్పులకు వీలులేనిదని , అంతేకాకుండా దీనిపై ఎటువంటి ప్రశ్నలకు దిగరానిదనే అర్థం ఉందని తెలిపారు. తమ నేత కరుణానిధి, ఇప్పుడు స్టాలిన్ తమిళనాడులో కులాల వారీ వ్యవస్థల నిర్మూలనకు కంకణం కుట్టుకున్నారని తెలిపారు. కరుణానిధి హయాంలో సనాతన వాదానికి వ్యతిరేకంగా సమతేవాపురాలు వెలిశాయి. ఇక స్టాలిన్ సమాజంలోని పలు వర్గాలకు అర్చక వృత్తికి వీలు కల్పించారని చెప్పారు. తామూ ఇదే బాటలో నడుస్తామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News