నీతి ఆయోగ్ శుభవార్త
వ్యాక్సిన్ ఒప్పందం దిశగా కేంద్రం కదలికలు
ఐదు ఫార్మా కంపెనీలకు ఆహ్వానం
రోడ్ మ్యాప్ సమర్పించాలని సూచన
న్యూఢిల్లీ: భారత్లో కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించి నీతి ఆయోగ్ గూడ్న్యూస్ చెప్పింది. మూడోదశ ట్రయల్స్కు ఓ వ్యాక్సిన్ సిద్ధమైనట్లు నీతి ఆయోగ్ ప్రకటన చేసింది. నేడో, రేపో ఆ ట్రయల్స్ కూడా ప్రారంభమవుతాయని నీతి ఆయోగ్ ప్రతినిధి వికె పాల్ సోమవారంనాడిక్కడ మీడియాకు వెల్లడించారు. మిగతా రెండు వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ ట్రయల్స్లో ఉన్నట్లు ఆయన వివరించారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందుకు సంబంధించి మూడు రోజుల్లోగా రోడ్మ్యాప్ను సమర్పించాల్సిందిగా ఐదు దేశీయ ఫార్మా కంపెనీలను ఆహ్వానించింది. దేశ కరోనా వ్యాక్సిన్ విధానం గురించి చర్చించేందుకు సోమవారం నిపుణుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భారీ ఎత్తున కొవిడ్ వ్యాక్సిన్ను తయారుచేసేందుకు కావాల్సిన కనీస సమయం, ఆశిస్తున్న ధర తదితర వివరాలను తెలపాలంటూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలాల, బయోలాజికల్ ఈ, జెన్నోవాలను కోరారు. ఈ విషయమై గురువారంలోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆయా సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వం సూచించింది. కొవిడ్ వ్యాక్సిన్ ప్రయత్నాలు విజయవంతం అయిన వెంటనే అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు వ్యాక్సిన్ తయారీదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్ ఇప్పటి వరకూ ఏ సంస్థతోనూ ఆ విధమైన ఒప్పందానికి రాలేదు. ఈ నేపథ్యంలో దేశీయంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీదారును ఎంపిక చేసే బాధ్యతను.. నేషనల్ టెక్నికల్ ఎడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ)కి చెందిన స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీకి అప్పగించారు.
Vaccine ready for third trials in India