Sunday, April 28, 2024

మానకొండూర్ కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ క్రైం: మానకొండూర్ మండల కేంద్రంలో జరిగిన తుపాకీ పేలుడు సంఘటనలో ప్రధాన నింధితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు వివరాలు వెల్లడించారు. నింధితుడిని గతంలోనే పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. కమీషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన వీణవంక సాయితేజ (27) చెల్లెలు ఆత్మహత్య చేసుకుని మరణించడానికి మానకొండూర్‌కు చెందిన భాషబోయిన అరుణ్ (35) ప్రధాన కారకుడంటూ మనసులో కక్ష పెంచుకుని తన స్నేహితులైన మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కందుల ప్రదీప్ (25) అలియాస్ చంది అలియాస్ ఆర్య, భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతానికి చెందిన పాల మల్లేశంలతో కలిసి గత ఏప్రిల్ 19న హైదరాబాద్ నుండి ద్విచక్ర వాహనంపై మానకొండూర్‌కు వచ్చి అదే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో భాషబోయిన అరుణ్ (35)పై గతంలో ఢిల్లీలో అక్రమంగా కొనుగోలు చేసిన నాటు తుపాకీతో కాల్పులు జరిపారు.

ఈ దాడిలో నాటు తుపాకీ పేలక పోవడంతో భాషబోయిన అరుణ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనలో నిందితుడు పాల మల్లేశంను గతంలోనే అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీణవంక సాయితేజపై హైదరాబాద్ నగరంలోని అల్వాల్, నల్లకుంట, మంచిర్యాల జిల్లా జైపూర్ ,పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లలో మత్తు, మాదక పదార్దాల వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రధాన నింధితుడైన వీణవంక సాయితేజ కదలికలపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో గురువారం మానకొండూర్ ఇన్స్‌పెక్టర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఈ సంఘటనలో ఒక నాటు తుపాకీ రెండు తుటాలను స్వాధీన పరుచుకోవడం జరిగిందని తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మానకొండూర్ ఇన్స్‌పెక్టర్, సిబ్బందిని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News