లండన్: మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన మూతపడిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు ఇచ్చిన రుణాలను రాబట్టుకోవడం కోసం యత్నిస్తున్న స్టేట్బ్యాంక్ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియం ఇప్పుడు లండన్లోని హైకోర్టులో విజయ్ మాల్య దాఖలు చేసుకున్న దివాలా దరఖాస్తుపై జరుగుతున్న విచారణపై మళ్లీ దృష్టిపెట్టాయి. శుక్రవారం చీఫ్ దివాలా, కంపెనీల కోర్టు (ఐసిసి) జడ్జి మైకేల్ బ్రిగ్స్ ముందు జరిగిన వర్చువల్ విచారణలో ఇరు పక్షాల తరఫున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు లాంటి హేమాహేమీలు తమ వాదనలను వినిపించారు. బ్రిటన్లో తమ అప్పులను రాబట్టుకోవడం కోసం ఈ కేసులో ఉన్న భారతీయ ఆస్తులపై తమ సెక్యూరిటీని వదులుకునే హక్కు తమకు ఉందని బ్యాంకులు వాదించగా, ఈ నిధులు భారత్లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధీనంలో ఉన్నవని, అందువల్ల వాటికి ఆ ఆస్తులను వదులుకునే హక్కు లేదని మాల్య తరఫు న్యాయవాదులు వాదించారు. అనేక సందర్భాల్లో ఇరు పక్షాల మధ్య వాదనలు వాడీ, వేడిగా సాగాయి. కాగా ఈ కేసులె తదుపరి విచారణ కొత్త సంవతసరంలో జరుగుతుంది. అయితే తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.