Sunday, April 28, 2024

అఫ్గాన్ సిరీస్‌కు టీమిండియా ఎంపిక

- Advertisement -
- Advertisement -

ముంబై: సొంత గడ్డపై అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం ఆదివారం టీమిండియాను ఎంపిక చేశారు. భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి కూడా జట్టులో స్థానం దక్కింది. రానున్న టి20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కీలక ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలకు జట్టు చోటు కల్పించారు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్, కోహ్లిలు తిరిగి టి20 జట్టులోకి వచ్చారు. వీరిద్దరూ చివరి సారిగా 2020 టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత రోహిత్, కోహ్లిలు టి20 జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ ఏడాది జరిగే టి20 వరల్డ్‌కప్ కోసం మెరుగైన జట్టును తయారు చేయాలని బిసిసిఐ భావిస్తోంది.

ఇందులో భాగంగానే సీనియర్లు రోహిత్, కోహ్లిలకు చోటు కల్పించారు. వీరి ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, సీనియర్ బౌలర్లు బుమ్రా, సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. గాయాల కారణంగా హార్దిక్ పాండ్య, రుతురాజ్, సూర్యకుమార్‌లను జట్టులోకి తీసుకోలేదు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రింకు సింగ్, జితేశ్ శర్మలకు జట్టులో స్థానం లభించింది. సంజూ శాంసన్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు. కానీ కెఎల్ రాహుల్‌కు జట్టులో చోటు దక్కలేదు. కాగా, అఫ్గాన్‌తో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 11న తొలి టి20, 14న రెండో, 17న బెంగళూరులో మూడో, చివరి టి20 జరుగనుంది.
జట్టు వివరాలు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్‌వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ, శాంసన్, శివమ్ దూబె, సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్, రవిబిష్ణోయ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News