మన తెలంగాణ/హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) భూ నిర్వాసితులకు తమ పార్టీ అండగా ఉంటుందని టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఆదివారం ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులు హైదరాబాద్లోని టిజెఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి తమకు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వారు కోదండరాంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆర్ఆర్ఆర్ కొత్త అలైన్మెంట్ వల్ల కార్పొరేట్ కంపెనీలు, భూస్వాములకు లాభం జరుగుతుందని, ఔటర్ రింగు రోడ్కు 40 కిలోమీటర్ల దూరం ఉండగా ఇప్పుడు 28 కిలోమీటర్ల దూరంలోనే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఇచ్చారని, చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్, మర్రిగూడ మండలాల రైతులు కోదండరాం దృష్టికి తెచ్చారు. ఈ కొత్త అలైన్మెంట్ వల్ల చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వారిని ఉద్దేశించి కోదండరాం మాట్లాడుతూ భూ నిర్వాసితులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గతంలో అనేక పోరాటాలలో టిజెఎస్ రైతుల పక్షాన పోరాటం చేసిందని గుర్తు చేశారు. రైతులు తమ భూములకు సంబంధించిన అన్ని విషయాలపై అధ్యయనం చేసి, ఆ భూములు తమకు ఎంత విలువైనవో తెలిపేలా ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని కోరారు. అందుకు తెలంగాణ జన సమితి సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లె వినయ్ కుమార్, ఆశప్ప, భూ నిర్వాసితుల నాయకులు భీమగాని మహేష్ గౌడ్, పల్లె శేఖర్ రెడ్డి, పల్లె పుష్పారెడ్డి, గుండె మల్లేశం, సుర్వి రాజు, నడికుడి అంజయ్య, బద్దుల వెంకటేష్, వర్ధన్ నాగార్జున, గంట కృష్ణారెడ్డి, గుండె జంగయ్య, గాజుల భగత్, భాస్కర్ రెడ్డి, సుర్కంటి కార్తీక్ రెడ్డి, వడ్డేపల్లి స్వామి, సుర్కంటి శశికళ, చంద్రకళ, పల్లె పుల్లారెడ్డి, కొలను మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: కెఎ పాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదు