కొత్త నినాదంతో తృణమూల్ కాంగ్రెస్
కోల్కత: పశ్చిమ బెంగాల్ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటి వ్యక్తి ఉండబోరంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన మరుసటి రోజే అధికార తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) శనివారం కొత్త నినాదాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై జరుగుతున్న లోపలి-వెలుపలి చర్చ సందర్భంగా టిఎంసి ఈ కొత్త నినాదాన్ని ముందుకు తెచ్చింది. బెంగాల్ తన సొంత పుత్రికనే కోరుకుంటోంది అంటూ టిఎంసి తీసుకొచ్చిన నినాదం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బెంగాల్ పుత్రికగా అభివర్ణిస్తోంది. టిఎంసి ఈ నినాదాన్ని విడుదల చేసిన వెంటనే రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రి మమత ఫోటోతో ఉన్న ఈ పోస్టర్ను తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు.
టిఎంసి సందేశం చాలా విస్పష్టంగా ఉందని, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు, తూర్పు నుంచి పశ్చిమ వరకు బెంగాల్ వ్యాప్తంగా ఒకే ఒక్క పేరు మార్మోగుతోందని, అది మమతా బెనర్జీ పేరని టిఎంసి నాయకుడు, ఎంపి అభిషేఖ్ బెనర్జీ ట్వీట్ చేశారు. తన సొంత ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడే వ్యక్తి, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించే వ్యక్తి, బెంగాల్ను ముందుకు తీసుకెళ్లగల ఏకైక వ్యక్తి బెంగాల్ పుత్రిక మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. బెంగాల్లో మౌలిక సౌకర్యాలు, విద్య, ఆరోగ్య, పారిశ్రామిక రంగంలో జరిగిన అభివృద్ధిని ప్రజలే గుర్తించాలని టిఎంసి ఎంపి డెరెక్ ఓబ్రియన్ తెలిపారు.