Friday, May 3, 2024

పరీక్షల నిర్వహణలో కీలక అంశాలను ఎందుకు విస్మరించారు? : హైకోర్టు

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్ : గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణలో భద్రతా పరంగా కీలక అంశాలను ఎందుకు విస్మరించారని టిఎస్‌పిఎస్‌సిని హైకోర్టు ప్రశ్నించింది. అక్టోబరులో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదని అడిగింది. బయోమెట్రిక్, ఓఎంఆర్ షీటుపై అభ్యర్థి ఫొటో వంటి ఏర్పాట్లపై సుమారు రూ.కోటిన్నర ఖర్చవుతుందని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేయడం టిఎస్‌పిఎస్‌సి చట్ట పరమైన బాధ్యత అన్న హైకోర్టు పరీక్షల కోసం అభ్యర్థులు ఫీజు చెల్లిస్తున్నారని ప్రస్తావించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ముగ్గురు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీదేవి విచారణ జరిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడం, ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్ నంబరు, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అక్టోబరు 16న చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదని టిఎస్‌పిఎస్‌సిని హైకోర్టు ప్రశ్నించింది. బయోమెట్రిక్, ఓఎంఆర్ షీటుపై ఫొటో వంటి కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించాలని ఉన్నత న్యాయస్థానం అడిగింది. పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఒకరి బదులు మరొకరు రాయకుండా ఉండేందుకు ఇవి అవసరం కదా అని పేర్కొంది.

పరీక్షల ఏర్పాట్లు ఎలా చేయాలనేది టిఎస్‌పిఎస్‌సి విచక్షణ అని కమిషన్ తరఫున న్యాయవాది వాదించారు. అనుభవం, నైపుణ్యంతో కమిషన్ తగిన ఏర్పాట్లు చేస్తుందన్నారు. సుమారు 3 లక్షల 80 వేల మంది రాసిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై కేవలం ముగ్గురు పిటిషన్ వేశారని, మిగతా వారెవరూ అభ్యంతరాలు చెప్పలేదని టిఎస్‌పిఎస్‌సి వాదించింది. పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు జరిగాయని, ఆధార్, పాన్ వంటి గుర్తింపు కార్డుల ద్వారా ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధ్రువీకరించుకున్నారని టిఎస్‌పిఎస్‌సి వివరించింది. బయోమెట్రిక్, ఓఎంఆర్ షీటుపై ఫొటో కోసం సుమారు రూ.కోటిన్నర ఖర్చవుతుందని కమిషన్ తెలిపింది. పరీక్షల నిర్వహణలో ఖర్చులు ముఖ్యం కాదని, పారదర్శకంగా నిర్వహించడం టిఎస్‌పిఎస్‌సి చట్టబద్ధమైన బాధ్యత అని హైకోర్టు పేర్కొంది. పిటిషన్‌పై మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News