సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్కప్ 2020 ఫైనల్ రసవత్తరంగా మారింది. సౌతాఫ్రికా జట్టుతో గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచి మరోసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆసీస్ జట్టులో మెగ్ లానింగ్(49) రాణించగా.. బెత్ మూనీ(28), అలెసా హీలీ(18)లు పర్వాలేదనిపించారు.
ఆ తర్వాత వర్షం కారణంగా.. 13 ఓవర్లలో 98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్దేశిత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టుపై 5 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించి ఫైనల్ కు వెళ్లింది. మరోవైపు భారీ వర్షం కారణంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దైంది. అయితే, గ్రూప్ దశలో అన్ని మ్యాచ్ లు గెలిచి అగ్రస్థానంలో నిలిచిన భారత్ నేరుగా ఫైనల్ కు చేరుకుంది. దీంతో మార్చి 8న మెల్బోర్న్ వేదికగా ఆథిత్య జట్టు ఆస్ట్రేలియాతో భారత్ ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది.
Womens T20 World Cup: AUW Beat SAW by 5 Runs