Sunday, April 28, 2024

హంతకులు రాజకీయాల్లో ఉండొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి వివే కానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లా డుతూ తన తండ్రి మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం తాను ఐదేళ్లుగా పోరాడుతున్న పట్టించుకోవడంలేదని, తనకు ప్రజా కోర్టులోనే తీర్పు కావాలని కోరారు. తన తండ్రికి న్యాయం జరిగే ప్రజా తీర్పు కావాలని కోరుకుంటున్నా ను అని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఎక్కువని, మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తే తన తండ్రి హత్య కేసుకు న్యాయం జరగదని వాపోయారు. తన తండ్రి వివేకా హత్యోదంతంలో జగన్ పాత్రపై విచారణ జరపాలని కోరారు. హత్య జరిగిన కొద్దిసేపటికే తన బాబాయ్‌ని గొడ్డలితో నరికి చంపారని జగన్ అన్నారు. ఈ విషయం ఆయనకు ఎలా తెలిసింది? అని ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా జగనన్న తీరు తనకు అనేక అనుమానాలు రేకెత్తించిం న్నారు.

కాబట్టి జగనన్న నుండి అసలు నిజాలు రాబట్టాలని ఆయన దోషి అయితే శిక్షించాలి, నిర్దోషి అయితే వదిలేయాలని కోరారు. మొదట్లో తన తండ్రి హత్య గురించి జగనన్నతో మాట్లాడినప్పుడు ఎలాంటి అనుమానం రాలేదని తెలిపారు. సొంత కుటుంబసభ్యులను కూడా అనుమానించడం మంచిదికాదని అనుకున్నా, కానీ ఆ తర్వాత ఒక్కో వాస్తవం బయటకు వచ్చిందన్నారు. ఆ తర్వాత అందరినీ అనుమానించాల్సి వచ్చిందన్నారు. ఇక ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని జగనన్నను కోరానని, అప్పుడు ఆయన అవినాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారని తెలిపారు. సిబిఐ విచారణకు వెళితే అవినాష్ బిజెపిలో చేరతాడని జగన్ అన్నట్లు సునీతారెడ్డి వెల్లడించారు. అందుకే తానే వెళ్లి సిబిఐకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సిబిఐకి వెళ్ళిన తరువాత తనతో పాటు భర్తకు వేధింపులు పెరిగాయని, సిబిఐ పైన కేసులు పెట్టడం మొదలు పెట్టారని ఆరోపించారు. కేసు విచారణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పాటు కర్నూలు ఆసుపత్రి దగ్గర ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసునన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని వాళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని ఆరోపించారు. జగన్‌పై ఉన్న 11 కేసులు మాదిరిగా వివేక హత్య కేసు కాకూడదన్నారు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలేనని వెల్లడించారు.

సాధారణంగా హత్య కేసుల్లో నాలుగైదు రోజుల్లోనే నిందితులు ఎవరన్నది తేలిపోతుందని, వివేకా హత్య కేసులో ఐదేళ్లయిన ఇంకా ఎందుకు తేలడం లేదు? అని ప్రశ్నించారు. 2017 ఎంఎల్‌సి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి పోటీ చేశారని, ఆయనను ఓడించాలని కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. సొంత వాళ్లే మోసం చేయడంతో వివేకా ఓడిపోయారని, అయినా నిరాశ చెందకుండా మరింత యాక్టివ్ అయ్యారని వెల్లడించారు. ఎంత ప్రయత్నించినా ఆయనను అణగదొక్కలేక పోతున్నామని భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైందని, అప్పట్లో తమకు ఇదంతా అర్థం కాలేదన్నారు. హత్య తర్వాత మార్చి 15, 2019 న మార్చురీ బయట అవినాష్ తన వద్దకు వచ్చారని, రాత్రి 11:30 గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా ‘హంతకులు మన మధ్య ఉంటారని, మనం మాత్రం రియలైజ్ కాలేమ’ని వాపోయారు. వివేకానంద రెడ్డి చంపిన వారిని వదిలిపెడితే ఏమి సందేశం వెళుతుందని, సిబిఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావడం లేదు? అని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు ఉండకూడదని,

వంచన, మోసానికి పాల్పడిన తమ అన్న పార్టీ వైసిపికి ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. అవినాష్, భాస్కర రెడ్డిని ఇంకా ఆయన రక్షిస్తూనే ఉన్నారని, ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలు పెరుగుతాయని వెల్లడించారు. జగన్ పాత్రపైన విచారణ చేయాలని మరోమారు స్పష్టం చేశారు. ఎపి ప్రజల మద్దతు తీర్పు తనకు కావాలన్నారు. వివేకానంద రెడ్డి కేసు విచారణలో ప్రతి ఒక్కరి సహకారం తనకు కావాలని, ఎపి ప్రజల మద్దతు ప్రజా తీర్పు తనకు అనుకూలంగా అందించాలని కోరారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించే అడుగుతున్నారని, ఈ కేసు పోరాటంలో అండగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎంపి రఘురామకృష్ణ రాజుకు ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News