Tuesday, May 7, 2024

హైదరాబాద్ లో ‘రూట్ పాస్’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః సాధారణంగా ఆర్‌టిసి బస్సుల్లో రూట్ పాస్ అంటే అది విద్యార్థులకు మాత్రమే ఇస్తారు. కాని సంస్థను ఆర్దికంగా పరిపుష్టం చేయడమే కాకుండా సాధారణ ప్రయాణికులు సైతం అందుబాటులో ఉండేందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్‌ఆర్‌టిసి) శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న ఆర్‌టిసి తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్‌కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది .నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్టినరి రూట్ బస్ పాస్ కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 గా ధరను టిఎస్‌ఆర్‌టిసి నిర్ణయించింది.

ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్ ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు. హైదరాబాద్ లో ప్రయాణికులకు జనరల్ బస్ టికెట్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్ కు రూ.1150, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ దారులు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్ లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది.

తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే జనరల్ రూట్ పాస్ ను టిఎస్‌ఆర్‌టిసి రూపొందించింది. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయితీలను టిఎస్‌ఆర్‌టిసి ఇప్పటికే ప్రకటించింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్ ను సంస్థ ప్రారంభించింది. సాధారణంగా ఆర్డినరి రూట్ పాస్ కు రూ.800, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1200 గా ఉంటుంది. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి. సిటీ ఆర్డినరి రూట్ బస్ పాస్ ను రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ రూ.1000కే అందిస్తొంది. హైదరాబాద్ లో ప్రస్తుతం జనరల్ మెట్రో పాస్ లు 1.30 లక్షలు, ఆర్డీనరీ పాస్ లు 40 వేల వరకు ఉన్నాయి. వాటి మాదిరిగానే కొత్తగా తీసుకువచ్చిన రూట్ పాస్‌ను ప్రయాణికులు ఆదరించి సంస్థ ఆర్దికాభివృద్దికి సహకరించాలని ఆర్‌టిసి ఎండి వి.సి. సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News