Sunday, May 5, 2024

తీహార్ జైలులో ఖైదీల నుంచి 1100కు పైగా సెల్ ఫోన్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

దేశంలోనే అత్యంత భద్రత ఉండే తీహార్ జైలులో సెల్ ఫోన్‌లు పట్టుబడుతుండటం గమనార్హం. కరుడుగట్టిన నేరస్తులు, గ్యాంగ్ స్టర్లను ఆ జైలులోనే ఉంచుతారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో అరెస్టయిన ప్రముఖ నేతలు, విఐపిలను సైతం ఖైదు చేసేదీ అక్కడే. అంత భద్రత ఉన్నా ఖైదీలకు బయటి నుంచి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ చేరిపోతూనే ఉన్నాయి. జైలు సిబ్బంది అప్పుడప్పుడూ ఖైదీలను తనిఖీ చేసినప్పుడు అవి పట్టుబడుతున్నాయి. ఈ విధంగా గత 15 నెలల్లో ఏకంగా 1,100 సెల్ ఫోన్లను ఖైదీల నుంచి తీహార్ జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కాగా, జైలు లోపల పట్టుబడిన సెల్ ఫోన్లు చాలా చిన్న పరిమాణంలో ఉన్నాయని జైలు వర్గాలు వెల్లడించాయి. జైలులోని గ్యాంగ్ స్టర్ ఖైదీలు వాటిని ‘ఖిచోరా’ అని పిలుచుకుంటారని తెలిపాయి.

ఖైదీలను తనిఖీ చేసినప్పుడు కొన్ని పెన్ డ్రైవ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా దొరికాయని, జైలు లోపలి సమాచారాన్ని బయటికి పంపేందుకు వాటిని వినియోగిస్తున్నట్టు తేలిందని వెల్లడించాయి. జైల్లోకి వస్తున్న ఖైదీలు సెల్ ఫోన్లు, ఇతర నిషేధిత వస్తువులను తమ శరీరం లోపల దాచుకుని తెస్తున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. బాడీ స్కానర్లకు దొరక్కుండా వాటికి కార్బన్ రేపర్లు చుట్టి, నోటి ద్వారా మింగి తీసుకువస్తున్నారని వివరిస్తున్నారు. ఇక ఖైదీల కోసం తెచ్చే ఆహారం, దుస్తుల వంటి వాటిలోనూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తెస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వాటిని నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తీహార్ జైలు డిజి సంజయ్ బెనివాల్ వెల్లడించారు. ఖైదీలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలేవీ వాడకుండా, పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News