న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 13,586 కొత్త కోవిడ్-19 కేసులు, 336 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షల 80,532కి చేరింది. భారత్ లో ప్రస్తుతం 1,63,248 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశంలో 2,04,711 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని నయమైయ్యారు. 12,573 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. రోజురోజుకూ భారత్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
తెలుగురాష్ట్రాల్లోని ప్రజలను కరోనా భయపెడుతోంది. ఎపిలో ఇప్పటివరకు 7,496మందికి కరోనా సోకగా.. 92మంది చనిపోయారు. తెలంగాణలో 6,027మంది కరోనా బారిన పడగా… 195 మరణాలు సంభవించాయి. దేశంలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అటు మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు లక్షా 20,504 మందికి కరోనా సోకింది. ఈ మహమ్మారి బారిన పడి 5,751 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,902 యాక్టివ్ కేసులున్నాయి. 60,838 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,334 చేరింది. ఇప్పటివరకు 625 మంది చనిపోయారు. ఢిల్లీలో 49,979 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 1,969 మందిని కరోనా కబలించింది. గుజరాత్ లో 25,601 కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడగా… 1,591 మంది మృతి చెందారు.
13586 new covid 19 cases and 336 deaths in india