Sunday, April 28, 2024

మధ్యప్రదేశ్‌లో వ్యాన్ బోల్తాపడి 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

దిండోరి (ఎంపి) : మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలో గురువారం మధ్యాహ్నం లోయలో వ్యాన్ బోల్తాపడి 14 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. బద్జార్ ఘాట్ సమీపాన మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్ డ్రైవర్ అదుపు తప్పడంతో 50 అడుగుల లోతు లోయలో వ్యాన్ బోల్తాపడింది. 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు పురుషులు కాగా, ఆరుగురు మహిళలు, బాలుడు ఉన్నారు. ఈ ఘోర ప్రమాదానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ. 2 లక్షలు వంతున, గాయపడిన వారికి రూ. 50,000 వంతున ప్రధాని మోడీ ఆర్థిక సాయం ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల వంతున సాయం ప్రకటించారు.

దిండోరి జిల్లా షాపురా బ్లాక్ లోని మసూర్ గుఘ్రీ గ్రామంలో ఒక కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి అంహాయి దేవ్రీకి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని సబ్‌డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ముఖేశ్ అవింద్ర చెప్పారు. దిండోరి జిల్లా కలెక్టర్ వికాస్ మిశ్రా, ఎస్‌పి అఖిల్ పటేల్ ప్రమాదస్థలానికి వెళ్లి బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని షాపురా కమ్యూనిటీహెల్త్ సెంటర్‌లో చికిత్సకోసం చేర్చారు. వీరిలో ఆరుగురి పరిస్థితి క్లిష్టంగా ఉందని తెలుస్తోంది. ఇద్దరిని జబల్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర మంత్రి సంపతీయ యుకేను వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి యాదవ్ సూచించారు. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సిఎం కమల్‌నాథ్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News