Wednesday, May 8, 2024

15.49లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

- Advertisement -
- Advertisement -

రైతుల ఖాతాలకు రూ.2,920కోట్లు

15.49 lakh tonnes of grain purchased in India
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాక ఇప్పటివరకూ 15.49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలసంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు రాష్ట్రంలో ధాన్యంకొనుగోళ్లతీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో రైతులనుంచి ధాన్యం కొనుగోలుకోసం 7,114 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రతిపాదించగా, ఇప్పటివరకూ 5,884 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. వివిధ జిల్లాలనుంచి రెండు లక్షల మంది రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్టు తెలిపారు.ధాన్యం కొనుగోళ్లకు తగ్గట్టుగా రూ.2,920కోట్లు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నట్టు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అవసరమై నిధులను ముఖ్యమంత్రి కెసిఆర్ సమకూర్చారన్నారు . ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా చెల్లింపులు జరపాలని , ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే మూడు రోజుల్లోగా రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కొనుగోలు కేంద్రాలనుంచి మిల్లులకు రవాణ జరిగే ధాన్యం బస్తాలను దించుకున్న వెంటనే మిల్లర్లు ధాన్యం వివరాలను తక్షణం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే రైతులకు అనుకున్న విధంగా నగదు చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుదని , ఈ విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరినట్టు తెలిపారు.
నిల్వలు ఎప్పటికప్పుడు క్లియర్
రాష్ట్రంలో అకాల వర్షాలను దృష్టిలోఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలుకేంద్రాలనుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్‌లోడింగ్ చేసుకుని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు ధాన్యం అమ్మకోవడానికి వేచిచూసే పరిస్థితి లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని సూచించారు. లారీలు , హామాలీల కొరత లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలన్నారు.ధాన్యం కొనుగోళ్లతో సంబంధం ఉన్న వ్యవసాయ ,రెవెన్యూ, రవాణా, సహకార తదితర విభాగాలతో క్షేత్ర స్థాలయిలో సమన్వయం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించిన తర్వాత అక్కడ తాలుపేరుతో తరుగు తీయడం చట్టవిరుద్దమని హెచ్చరించారు.ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు నష్టం కలుగకుండా చూడాలన్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా అవసరమైన టార్ఫాలిన్లు రైతులకు అందుబాటులో ఉండేవిధంగా చూడాలన్నారు. మార్కెటింగ్ శాఖతో సమన్వయం చేసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News