న్యూఢిల్లీ: 351 రకాల రక్షణ పరికరాల దిగుమతులపై వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి నిషేధం అమలవుతుందని రక్షణశాఖ బుధవారం ప్రకటించింది. వీటిలో ఉప వ్యవస్థలు, వివిధ పరికరాలున్నాయి. సైన్యానికి అవసరమైన సామగ్రిని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశంలోనే తయారు చేయించాలన్న లక్షంలో కేంద్రం చర్యలు చేపట్టింది. 16 నెలల్లో మూడోసారి నిషేధిత దిగుమతుల జాబితాను రక్షణశాఖ ప్రకటించింది. తాజా ప్రకటన అమలులోకి వస్తే ఏటా రూ.3000 కోట్ల విదేశీ మారకం ఆదా అవుతుందని తెలిపింది.
రక్షణ విభాగంలో స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఈ విభాగంలో 2500 పరికరాలను స్వదేశంలోనే తయారు చేయడం ప్రారంభమైందని పేర్కొన్నది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న 351 పరికరాలను మూడేళ్లలో దేశంలోనే తయారు చేయనున్నట్టు తెలిపింది. రక్షణ ఉత్పత్తులను ఐదేళ్లలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్కు చేర్చాలన్నది ఆ శాఖ లక్షంగా నిర్ణయించింది. అదే సమయంలో సైనిక పరికరాల ఎగుమతుల్ని రూ.35,000 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యం. అందుకు అనుగుణంగానే రక్షణ పరికరాల తయారీరంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 నుంచి 74 శాతానికి పెంచుతూ గతేడాది మే నెలలో నిర్ణయం తీసుకున్నది.