Friday, May 3, 2024

ఆ 40కోట్ల డీల్ సంగతేంది?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసిపి ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి రెండో రోజు సీబీఐ విచారణ ముగిసింది. దాదా పు 9 గంటల పాటు ఆయనను సిబిఐ అధికారులు విచారించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు పరిణామాలపై ఆరా తీశారు. అవినాష్ రెడ్డి రాజకీయ ఎంట్రీ పైన కూడా కూపీ లాగారు. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీల పైన కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రూ.40 కోట్ల డీల్ పై అవినాష్ రెడ్డి పాత్ర ఏంటనేదానిపైన కూడా ఆరా తీశారు. సహజమరణంగా ఎందుకు చిత్రీకరించారని ప్ర శ్నించారు. అయితే, కొత్త విచారణ అధికారి వికాస్ సింగ్ కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై దర్యాప్తు జరపాలని కోరారు. వివేకా ఫోన్‌లో ఉన్న వివరాలు బయట పెట్టాలని అవినాష్ కోరా రు.

వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ను ఎందుకు విచారణ చేయడం లేదని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్‌ల రెండో రోజు సీబీఐ విచారణ ముగిసిన తరువాత తిరిగి వారిని అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. నిందితులు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సిబిఐ అధికారులు గురువారం 6 గంటల పాటు విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసు అంశానికి సంబంధించి దారితీసిన ప్రధాన కారణాలపై సిబిఐ ఆరా తీసింది. ఆర్ధిక లావా దేవీలపై కూడా ప్రశ్నించారు. హత్యకు పన్నిన కుట్ర, సాక్ష్యాధారాలు చేరిపేయడంలో నిందితుల పాత్రపై విచారించారు.నిందితులను విడివిడిగా విచారించారు.

మరో వైపు వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరికి అప్రూవర్ హోదా కల్పించిన సీబీఐ నిర్ణయా న్ని సవాలు చేస్తూ వివేకానందరెడ్డి మాజీ పిఎ ఎంవి కృష్ణారెడ్డి, వైసిపి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు లో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా దస్తగిరిని అ ప్రూవర్‌గా మార్చొద్దని భాస్కరరెడ్డి, కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు జూన్ మూడో వారానికి వాయిదా వేసింది.
గంగరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ పిటిషన్ : విచారణ వాయిదా
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలక నిందితుడు అని, అతడి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ తెలంగాణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా, ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. సిబిఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర, అనిల్ వాదనలు వినిపించారు. వివేకాను అంతమొందించేందుకు కుట్ర, హత్య చేయడంలో గంగిరెడ్డిది కీలకపాత్ర అని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన సిట్ చార్జిషీటు వేయకపోవడం వల్లే గంగిరెడ్డికి బెయిల్ లభించిందని సిబిఐ వివరించింది.

ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉందని, అందుకే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నామని కోర్టుకు విన్నవించింది. ఇక, గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. గతంలో అన్నీ పరిశీలించాకే ఎపి హైకోర్టు బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించిందని తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న అనుమానంతో బెయిల్ రద్దు చేయరాదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News