హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు మెట్రో ఛార్జీల్లో రాయితీ వర్తిస్తుందని తెలిపారు. స్మార్ట్ కార్డు, ట్రిప్ కార్డుల ద్వారా 40 నుంచి 50 శాతం వరకు ప్రత్యేక రాయితీ కల్పించాలని నిర్ణయించామన్నారు. ట్రిప్ కార్డులపై రాయితీ రేపట్నుంచి మొదలుకుని సంక్రాంతి వరకు వర్తించనుంది అని స్పష్టం చేశారు. 40 శాతం రాయితీ కాకుండా ట్రిప్ కార్డులు కొన్నవారికి 2 నెలల వరకు రాయితీ ఉంటుందని స్పష్టం చేశారు. వరదల వల్ల నగరంలో రోడ్లు దెబ్బతిన్నాయని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. వరద రోజున ఒక గర్భిణీ కోసం ప్రత్యేకంగా ఒక మెట్రో రైలును నడిపామని తెలిపారు. ప్రస్తుతం రోడ్ల మీద ప్రయాణం కష్టంగా మారిందన్నారు. ఈ క్రమంలో మెట్రో ప్రయాణాలను ప్రోత్సహించాలని భావించామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
రాయితీల వివరాలు :
• స్మార్ట్ కార్డ్ ద్వారా 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం.
• 20 ట్రిప్పుల ఛార్జీలతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.
• 40 ట్రిప్పుల ఛార్జీలతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం.
టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబరు 1 నుంచి..
• 7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం.
• 14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.
• 20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.
• 30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరిగే అవకాశం.
• 40 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.