Wednesday, May 8, 2024

రాష్ట్రంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

403 covid cases reported in Telangana

403కు చేరిన రోజువారీ కేసులు
అందరూ తప్పనిసరిగా
కొవిడ్ నిబంధనలు పాటించాలి
పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో
బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి
అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి
అందరూ మాస్క్ ధరించాలి
వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలి
ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 26,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 403 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కొవిడ్ బారి నుంచి 145 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గత వారంతో పోలిస్తే రెట్టింపు కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరో వైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 12 వేలకుపైగానే నమోదైన కొత్త కేసులు మంగళవారం 10వేల దిగువకు చేరాయి. పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 79 వేలపైకి ఎగబాకాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి

కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధలు పాటించాలని ప్రజా ఆరోగ్యశాఖ పేర్కొంది. రద్ధీ ప్రాంతాల్లో మాస్క్, భౌతికదూరం తప్పనిసరని వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపింది. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. 20నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. ఇంటి నుంచి బయటకి వెళితే తప్పసరిగా మాస్క్ ధరించాలని పేర్కొంది. అలాగే భౌతికదూరం పాటించాలని తెలిపింది.

పని ప్రాంతాలలో శానిటైజర్లు, సబ్బు వంటివి అందుబాటులో ఉంచాలని సూచించింది. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, లేని పక్షంలో ఇంటికే పరిమితం కావాలని విజ్ఞప్తి చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పనిసరిగా కొవిడ్ పాటించాలని తెలిపింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ముక్కు కారడం,శ్వాస తీసుకోవడం ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తల నొప్పివంటి లక్షణాలు ఉన్న వారు తక్షణమే ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని కోరింది. బీపీ, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రయాణాలు చేకపోవడం మంచిదని సూచించింది. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News