న్యూయార్క్ : అమెరికా ముస్లింల్లో 69 శాతం మంది డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి బిడెన్కే ఓటు వేశారు. 17 శాతం మంది ట్రంప్కు మద్దతు ఇచ్చారు. అమెరికా లోని ముస్లిం సివిల్ లిబర్టీస్ అండ్ అడ్వొకసీ ఆర్గనైజేషన్(సిఎఐఆర్కెయిర్)సర్వేలో ఇది బయటపడింది. ఈ సంస్థ మంగళవారం ఎగ్జిట్ పోల్లో ఈ ఫలితాలు వెల్లడించింది. మొత్తం 844 రిజిస్టర్ అయిన ముస్లిం ఓటర్ కుటుంబాల్లో ఎక్కువ శాతం 84 శాతం మేరకు ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిలో 69 శాతం బిడెన్కు ఓటు వేయగా, 17 శాతం మంది ట్రంప్కు ఓటు వేశారు. ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది ఈసారి ఓటింగ్లో పాల్గొనడం రికార్డు స్థాయిలో గొప్ప మలుపు.
దేశం మొత్తం మీద అనేక ప్రాంతాల్లో ఫలితాలపై ముస్లిం సమాజం ప్రభావం కనిపించిందని కెయిర్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిహాద్ అవాద్ పేర్కొన్నారు. అమెరికా లోని ప్రజలందరి పౌర, మత సంబంధ హక్కులను కాపాడవలసిన బాధ్యత ఎన్నికైన ప్రతినిధులపై ఉందని కెయిర్ డైరెక్టర్ (ప్రభుత్వవ్యవహారాలు) రాబెర్టు ఎస్ మెక్కా పేర్కొన్నారు. 2016 ఎన్నికలతో పోలిస్తే అప్పటి ఎన్నికల్లో ట్రంప్ 13 శాతం ముస్లిం ఓట్లను సాధించగా, ఇప్పుడు 2020 ఎన్నికల్లో ట్రంప్ 4 శాతం మాత్రమే ముస్లిం ఓట్లను పొందగలిగారు. అమెరికా మొత్తం జనాభాలో 1.1 శాతం మంది వరకు ఉన్న ముస్లిం జనాభా 2017 లో దాదాపు 3.45 మిలియన్ వరకు ఉన్నట్టు ప్యూ రీసెర్చి సెంటర్ వెల్లడించింది.