Tuesday, May 7, 2024

దావోస్‌లో కెటిఆర్

- Advertisement -
- Advertisement -

World Economic Forum Conference

 

నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి
సదస్సును ప్రారంభించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
ప్రిన్స్ చార్లెస్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా తదితర ప్రముఖులతో వైభవో పేతంగా జరగనున్న సదస్సు, పురపోరుపై అక్కడి నుంచే కెటిఆర్ దృష్టి
టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలతో నేడు టెలీకానరెన్స్

హైదరాబాద్: రాష్ట్ర ఐటి,పరిశ్రమలు,మున్సిపాలిటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం తెల్లవారు జామున స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌కు చేరకున్నారు. 20వ తేదీ నుంచి 24వ తేదీవరకు జరగనున్న 50వ వరల్డ్‌ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా కెటిఆర్ పాల్గొననున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే ప్రత్యేకంగా కెటిఆర్ ను ఆహ్వానించారు. ప్రపంచంలోనే అత్యంతప్రతిష్ఠాత్మకమైన ఈ సదస్సును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించనున్నారు. అలాగే ఈ సదస్సులో బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, జర్మని ఛాన్షలర్ ఎంజెలా, ఆప్ఘన్‌కు చెందిన ఘని, పాకిస్తాన్ ప్రధాన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్,చైనా నుంచి హాన్‌జెంగ్, ఇటలీ ప్రధానమంత్రి, ఆస్ట్రేలియా ఛాన్షలర్ సెబాస్టిన్‌కుర్జ్, కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్‌తో పాటు ప్రపంచంలోని పలుదేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొనున్నారు.

వీరితో పాటు ప్రపంచదేశాల ప్రముఖ పారిశ్రామికపెట్టుబడిదారులు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. దేశం నుంచి కేంద్రమంత్రులు, పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొననున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. భారత దేశం నుంచి సదస్సుకు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్న పారిశ్రామిక వేత్తల్లో గౌతమ్ అదాని,రాహుల్ సంజీవ్ బజాజ్,కుమార మంగళం బిర్లా,టాటాగ్రూపుకు చెందిన ఎన్.చంద్రశేఖరన్, ఉదయ్ కోటక్,ఎస్‌బిఐ నుంచి రజనీష్‌కుమార్, ఆనంద్ మహేంద్ర,సునీల్ పరేఖ్, ఫిరోజ్ గోద్రెజ్ తదితరులు ఉన్నారు. ప్రపంచవ్యాపంగా పలుప్రసిద్ధకంపెనీలనుంచి 100 మంది సిఇఒలు, 3,000ల మంది ప్రతినిధులు ఈసదస్సులో పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన కెటిఆర్ 21వ తేదీన 4వ పారిశ్రామిక విప్లవం సాంకేతిక ప్రయోజనాలు అందులోని సవాళ్లపై ప్రసంగిస్తారు.

అనంతరం ప్రపంచ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరిపి తెలంగాణ నూతన పారిశ్రమిక విధానం ప్రకటించి పెట్టుబడులను ఆహ్వానించ నున్నారు. 20 నుంచి 24 వరకు పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు జరిపి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ఇదిలా ఉండగా 2018లో కెటిఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పారిశ్రామికాభివృద్ధిపై ప్రసంగించి రాష్ట్రానికి వేలాధి కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించారు. ఇందులో భాగంగానే టెక్‌మహేంద్రతో జరిపిన చర్చల్లో భాగంగానే వరంగల్‌లో ఐటి ప్రాంగణం ఏర్పాటు జరిగింది.

అలాగే 2019లో ఆహ్వానం అందినప్పటికీ ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హాజరు కాలేక పోయారు. ప్రస్తుతం జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా జరిగే పారిశ్రామిక వేత్తల సదస్సులో అనేక నూతన పరిశ్రమలకు పెట్టుబడులు సాధించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏవియేషన్, ఫార్మా, ఐటి రంగాల్లో నూతన పరిశ్రమలఏర్పాటుపై కెటిఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. దావోస్ పర్యటనలో మంత్రి కెటిఆర్‌తో పాటు ఐటి కార్యదర్శి జయేష్‌రంజన్,డిజిటల్ మాధ్యమ సంచాలకుడు కొణతం దిలీప్ వెళ్లారు.

దావోస్ నుంచి సమీక్షించనున్న కెటిఆర్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిఎంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారంపై నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని నాయకులు చెప్పారు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పోలింగ్ జరిగే 22వ తేదీననాయకులతో కెటిఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని తెలిసింది. ఎన్నికల అనంతరం ఫలితాలు వెలుబడే 24వ తేదీన కూడా కెటిఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని సమాచారం. దావోస్ నుంచి కెటిఆర్ తిరిగి 25వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆదే రోజున టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారని నాయకులు చెప్పారు.

KTR special guest at World Economic Forum Conference
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News