హైదరాబాద్: బిజెపి ఎంపి అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ సభలో వేముల మాట్లాడారు. పెన్షన్ల కోసం సిఎం కెసిఆర్ రూ.9 వేల కోట్లు ఇస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ కేవలం రూ.200 కోట్లే ఇస్తున్నారని తెలియజేశారు. కల్యాణ లక్ష్మికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రావడం లేదన్నారు. నిజామాబాద్లో 800 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతోందని, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం వాటా ఇవ్వాలని, అది రాష్ట్రాల హక్కు అని, కచ్చితంగా ఇచ్చి తీరాలన్నారు. సర్వేలన్నీ టిఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ కారు గుర్తుకే ఓటు వేసి టిఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎంఎల్ఎ గణేష్ రూ.800 కోట్లతో ఎంతో అభివృద్ధి చేశారని, బిజెపి నాయకులకు అభివృద్ధి కనిపించడంలేదా? అని వేముల ప్రశ్నించారు.