ముంబై : షీనా బోరా హత్య కేసులో అరెస్టు అయిన మీడియా మాజీ దిగ్గజం పీటర్ ముఖర్జీకి బెయిల్ దక్కింది. కేసు పూర్వాపరాల పరిశీలన తరువాత గురువారం బొంబాయి హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను జారీ చేసింది. జరిగిన నేరంలో ఆయన పాత్ర ఉన్నట్లు తెలిపే ప్రాధమిక సాక్షాధారం ఏదీ లేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి నితిన్ సాంబ్రే అభిప్రాయపడ్డారు. అయితే సిబిఐ విజ్ఞప్తిని ఈ కేసు విషయంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో పీటర్ పాత్ర విషయంపై తమ తీర్పును సిబిఐ విన్నపానికి అనుగుణంగా ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు, ఈ లోగా దర్యాప్తు సంస్థ తమ అభ్యంతరాలను తెలియచేసుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.
షీనా బోరా హత్య కేసులో 2015 నవంబర్ 19వ తేదీన పీటర్ను అరెస్టు చేశారు. హత్యోదంతంలో పీటర్ భార్య ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. రెండు లక్షల రూపాయల జమానత్తో పీటర్కు బెయిల్ మంజూరు చేశారు. హత్య జరిగిన దశలో పీటర్ దేశంలోనే లేడని , కేసు దర్యాప్తు సాగుతున్న దశలో నాలుగేళ్లకు మించి ఆయన జైలులో గడపుతున్నారని , ఇటీవలే బైపాస్ సర్జరీ కూడా జరిగిందని అన్నింటిని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇస్తున్నట్లు తెలిపిన న్యాయమూర్తి నేరానికి ఆయన బాధ్యుడని తెలిపే ఆధారం ఏదీ లేదని సిద్ధం చేసిన తమ ఆదేశాలలో పేర్కొన్నారు.
Peter Mukerjea Gets Bail in Sheena Murder Case