హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడారు. “ప్రజాస్వామ్య రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజాస్వామ్యంలో మంచి జరిగినా, చెడు జరిగినా ప్రజలు గమనిస్తున్నారు. ఎడ్డికాలం కాదిది, ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారు. టీఆర్ఎస్ ఇవాళ తిరుగులేని రాజకీయ శక్తి, ప్రజల దయతోనే మేం అధికారంలో ఉంటాం. 2014 ఎన్నికల్లో 63 స్థానాలను గెలుచుకున్నాం. 2018 ఎన్నికల్లో 88 స్థానాలను గెలుస్తే కాంగ్రెస్కు మతిపోయింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ నాయకులు రెండు నెలలపాటు పాట పాడారు. జడ్పీలన్నీ బ్యాలెట్ పేపర్పైనే గెలుచుకున్నా. ఈవీఎంలు అయినా, బ్యాలెట్ అయినా టిఆర్ఎస్సే గెలిచింది. ప్రజా జీవితంలో ఉండటమనేది ఒక మంచి అవకాశం. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండలేరు. ఇందిరాగాంధీ లాంటి వారు కూడా సామాన్యుల చేతిలో ఓడారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితో ఉందనడానికి సభలో వారి తీరే నిదర్శనం.
కాంగ్రెస్ నిరాశ, నిస్పృహలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా 4 శాతం ఓట్లకు పరిమితమైంది. రాజకీయాల్లో అధికారమే పరమావధిగా ఉండకూడదు. కాంగ్రెస్, బిజెపి లోపాయకారిగా ఒప్పందం చేసుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కయ్యాయి. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాశారు. ఏ ప్రాజెక్టు చేపట్టినా కేసు వేశారు. దురుద్దేశంతో కేసులు ఎందుకు వేస్తున్నారని కోర్టు చీవాట్లు పెట్టింది. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసేది వాళ్లే.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా ఎందుకు కావట్లేదనేది వాళ్లే” అని సిఎం కెసిఆర్ కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు.
CM KCR Speech at Telangana Assembly session 2020